పిల్లల్ని కాపాడబోయి.. 

స్కూల్‌ బస్సు డ్రైవర్‌ మృతి
– మహారాష్ట్రంలో ఘటన
ముంబయి, జూన్‌26(జ‌నం సాక్షి) : మహారాష్ట్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. సోమవారం పాల్‌గఢ్‌లో ఓ స్కూల్‌ బస్సు డ్రైవర్‌ వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు పిల్లలను రక్షించి తాను ప్రాణాలు కోల్పోయాడు. ప్రకాశ్‌ బాలు పాటిల్‌ అనే 40ఏళ్ల వ్యక్తి రోజూ విద్యార్థులను బస్సులో విరార్‌ స్కూల్‌కు తీసుకెళ్లి తీసుకొస్తుంటాడు. సోమవారం పాఠశాల ముగిసిన తర్వాత విద్యార్థులతో వస్తోన్న బస్సు భారీ వర్షాల కారణంగా నారంగి గ్రామం వద్ద కాలువలో చిక్కుకుపోయింది. అయితే ఇద్దరు పిల్లలు కిందకు దిగి వర్షపు నీటిలో ఆడుకోవడం మొదలుపెట్టారు. గమనించిన ప్రకాశ్‌ వెంటనే కిందకు దిగి వారిని తిరిగి బస్సు ఎక్కించేందుకు ప్రయత్నించారు. అంతలోనే వరద పెరగడంతోపాటు పిల్లలు కాలువలోని గుంతలో చిక్కుకుపోయారు. కానీ డ్రైవర్‌ ఎలాగోలా వారిని కాపాడారు. అయితే ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగి కొట్టుకుపోయాడు. చిన్నారులు నీళ్లలో మునగుతుండడం చూసి డ్రైవర్‌ ప్రకాశ్‌ పాటిల్‌ నీళ్లలోకి దూకి వారిని కాపాడారని పోలీసులు వెల్లడించారు. ప్రకాశ్‌కు భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు.