పెట్టుబడులు పెంచుతాం, పేదలకు సంపద పంచుతాం


స్కామ్‌పాలన ముగిసింది, పారదర్శకపాలన మొదలైంది
ఆర్ధికాభివృద్ధికి వాతావరణం బాగుంది
2015-16 బడ్జెట్‌లో ఆచితూచి జైట్లీ అడుగులు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28 : దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ర్టాలకు సమాన అధికారం అందించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. శనివారం లోక్‌సభలో 2015-16 ఆర్థిక బడ్జెట్‌ను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 9 నెలల పాలనలో ఆర్థికాభివృద్ధిలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. దేశంలో స్కామ్‌ల పాలన అంతమైందని, పారదర్శక పాలన మొదలైందని జైట్లీ తెలిపారు.
భారత ఆర్థిక వ్యవస్థ విశ్వసనీయత ప్రపంచవ్యాప్తంగా బాగా పెరిగిందని చెప్పారు. వృద్ధి, పెట్టుబడులు పెంచడం, సంపద అందరికీ పంచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. జీడీపీ వృద్ధిరేటు 7.4 శాతానికి చేరుకుంటుందని అంచనా మంత్రి వేశారు. ద్రవ్యోల్బణం 5.1 శాతానికి తగ్గిందని ఆయన చెప్పారు. విదేశీ మాదకద్రవ్యం నిల్వలు బాగా పెరిగాయన్న జైట్లీ విదేశీ మారకం నిల్వలు 340 బిలియన్ల డాలర్లకు చేరుకున్నాయన్నారు. రెండంకెల వృద్ధిరేటు సాధించే స్థితికి చేరుకున్నామని జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజా తీర్పునకు అనుగుణంగా అందివచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆయన తెలిపారు. అభివృద్ధికి ఆటంకంగా ఉన్న పరిస్థితులన్నీ అధిగమిస్తున్నామని జైట్లీ పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా 50 లక్షల మరుగుదొడ్లు నిర్మించామని చెప్పిన ఆయన 6 కోట్ల టాయిలెట్ల నిర్మాణమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. 12.5 కోట్ల కుటుంబాలు ఇప్పుడు జనధన యోజనలో చేరాయని తెలిపారు.
2016 ఏప్రిల్‌ 1 నుంచి సరుకులు, సర్వీసుల పన్ను అమల్లోకి వస్తుందని జైట్లీ ప్రకటించారు. 2020 నాటికి దేశంలో పూర్తిగా గ్రామాల విద్యుదీకరణ అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో అందుబాటులో వైద్య సేవలు అందజేస్తామన్నారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ప్రాథమిక పాఠశాలను నిర్మిస్తామన్నారు. మిగితా రాష్ర్టాలతో సమానంగా ఈశాన్య రాష్ర్టాలను అభివృద్ధి చేస్తామని అరుణ్‌జైట్లీ తెలిపారు.
35 ఏళ్ల లోపు వారు మూడింట రెండొంతుల మంది ఉన్నారని, యువతకు ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పన్నుల్లో 42 శాతం రాష్ర్టాలకు చెల్లింపులు జరిగాయని, పన్నులు, గ్రాంట్లు కలిపితే 62 శాతం రాష్ర్టాలకు చెల్లింపులు చేసినట్లు అరుణ్‌జైట్లీ వెల్లడించారు.