పైలట్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు

లక్నో,మే18(జ‌నం సాక్షి ):  దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు చెందిన విమానం భారీ ప్రమాదంనుండి తప్పించుకున్న ఘటన లక్నో అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. పైలెట్‌ అప్రమత్తత కారణంగా ఇండిగో విమానం ప్రమాదం నుంచి బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. లక్నోలోని చౌదరి చరణ్‌ సింగ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో 6ఈ-685 విమానంలో ఒక ఇంజీన్‌ విఫలమైంది. ఈ విషయాన్ని గమనించిన పైలెట్‌ టేక్‌ఆఫ్‌ని నిలిపివేసి అధికారులను అప్రమత్తం చేశారు. అయితే ఈ విషయాన్ని ప్రయాణికులకు తెలపకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రన్‌వైపై 
విమానాన్ని నిలిపి వేయడంతో విమానంలో విపరీతమైన వేడి, ఉక్కపోతతో అల్లాడిపోయారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. మరోవైపు ఇంజన్‌లో లోపాన్ని సరిచేయడానికి ఇండిగో ఇంజనీర్ల బృందం ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.