ప్రజలను మోసం చేసినందుకే షా పై దాడి: విహెచ్‌

న్యూఢిల్లీ,మే11(జ‌నం సాక్షి ):   ఏపీ ప్రజలను మోసం చేశారు కాబట్టే తిరుపతిలో అమిత్‌ షాపై దాడి చేశారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. అమిత్‌ షాపై జరిగింది చిన్నదాడే అని .. ఇంకా ముందుంది అని వీహెచ్‌ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మోసాన్ని భరించలేకే కర్ణాటకలో కాంగ్రెస్‌కు చంద్రబాబు మద్దతు తెలిపారన్నారు. కేసీఆర్‌, మోదీ మధ్య రహస్య ఒప్పందం ఉందని వీహెచ్‌ ఆరోపించారు. జేడీఎస్‌కు ఓటు వేయడమంటే బీజేపీకి వేసినట్టే అని తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని అందుకే రైతుబంధు కార్యక్రమానికి మమతా, స్టాలిన్‌ రాలేదని వీహెచ్‌ విమర్శలు గుప్పించారు.