ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి
గోవా తదితర రాష్ట్రాల్లో నీతి ఇక్కడెందుకు పాటించలేదు
గులాంనబీ ఆజాద్
బెంగళూరు,మే18(జనం సాక్షి ): ప్రభుత్వ ఏర్పాటులో గోవా, మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో అనుసరించిన విధంగానే కర్ణాటకలోనూ జరగాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కర్ణాటక కాంగ్రెస్ నేతల ఛలో రాజ్భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. గవర్నర్ తీరుకు నిరసనగా పార్టీ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు. పాదయాత్రలో ఆజాద్, ఖర్గే, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. బీజేపీ ప్రజాస్వామ్య విలువలను ఉల్లంఘించిందన్నారు. కర్ణాటకలో ఏ రాజకీయ పార్టీ పూర్తి మెజార్టీ సాధించలేదు. ఏ పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు లేవు. అధిక స్థానాలు సాధించిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం లేదు. కాంగ్రెస్ 78, జేడీఎస్ 38, ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధించారు. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఆట నిబంధనలను పూర్తిగా మార్చేసింది. బీజేపీ కొత్త విధానాలను తీసుకువస్తోందన్నారు. బీజేపీ మూడు రాష్ట్రాల్లో అనుసరించిన విధంగానే కర్ణాటకలోనూ జరగాలన్నారు. పూర్తి బలం లేకున్నా గవర్నర్ బీజేపీను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారన్నారు. రెండు వారాల్లో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పారు. కానీ నిబంధనల మేరకు వారం రోజుల్లోనే బలం నిరూపించుకోవాలని ఆయన పేర్కొన్నారు.
————-