ప్రత్యర్థులు పన్నిన..  కుట్రలను ధీటుగా ఎదుర్కొన్నాం


– మోదీ, జగన్‌, కేసీఆర్‌ తెదేపాను ఇబ్బంది పెట్టేలా కుట్రలు చేశారు
– ఓటింగ్‌శాతం తగ్గించేందుకు కుట్రలు పన్నారు
– ఒక్కపిలుపుతో.. ప్రజలంతా తెదేపా వెంట నిలిచారు
– 23న ఫలితాల్లో అదే రుజువవుతుంది
– అధికారుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు మంచివి కాదు
– రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనేదే నా సంకల్ప
– ఏపీ సీఎం చంద్రబాబు
అమరావతి, మే4(జ‌నంసాక్షి) : ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెదేపాను ఓడించేందుకు ప్రత్యర్థులు అనేక కుట్రలను పన్నారని, కుట్రలను ధీటుగా ఎదుర్కొని గెలవబోతున్నామని, 23న వెలువడే ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలతో తెదేపా ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తుందని ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. సార్వత్రిక ఎన్నికలపై అమరావతిలోని హ్యాపీ రిసార్ట్స్‌లో శనివారం తెదేపా సవిూక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెదేపాకు వ్యతిరేకంగా మోదీ, కేసీఆర్‌ అనేక కుట్రలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రజలందరి అభిప్రాయాలూ తీసుకున్నామని, మన పార్టీకి వ్యతిరేకంగా ప్రత్యర్థులు పన్నిన కుట్రలను పోటాపోటీగా ఎదుర్కొన్నామన్నారు. కార్యకర్తలతో మమేకమయ్యే తెదేపాలాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని మోదీ ప్రయత్నాలన్నీ చేశారన్నారు. తెదేపాకు ఏదోలా నష్టం కలిగించాలనేదే భాజపా ధ్యేయమన్నారు. తెదేపాకు నష్టం కల్గించేందుకు కేసీఆర్‌ కూడా ప్రయత్నించారన్నారు. రాష్ట్రంలో జగన్‌ కుట్రలకు మోదీ, కేసీఆర్‌ కుతంత్రాలు తోడయ్యాయరని, ఎందరు ఇబ్బందులు పెట్టినా ప్రజలు తెదేపా వెంటే ఉన్నారన్నారు. ప్రమాణాలు, ముహూర్తాలు, మంత్రి పదవులంటూ వస్తోన్న వార్తలన్నీ మైండ్‌గేమ్‌లో భాగమేనన్నారు. రాష్ట్రంలో ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు కుట్రలు పన్నారని, ఆ కుట్రలు తెలిసే ఓటింగ్‌కు తరలిరావాలని ప్రజలకు నేను పిలుపునిచ్చానని, ప్రజలంతా రాత్రివేళల్లోనూ క్యూలలో నిలబడి ఓట్లు వేశారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో తెదేపా విజయంపై సందేహం లేదని, సీట్లు, ఆధిక్యతపైనే దృష్టి ఉందన్నారు.  భవిష్యత్తులో జరిగే ప్రతి ఎన్నికలోనూ తెదేపానే గెలవాలని, నేను వాస్తవికత ప్రాతిపదికగానే మాట్లాడాతానని, పనిచేస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో తొలి దశలోనే ఎన్నికలు పెట్టడం తెదేపాకు మేలు చేసిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఓటర్లు ఏపీకి రాకుండా కేసీఆర్‌ కుట్రలు పన్నారని, ఓటర్లు ఓటు వేయకుండా అనేక ప్రయత్నాలు చేశారన్నారు. సొంత వాహనాల్లో వచ్చి మరీ పట్టుదలతో ఓటర్లు ఓట్లు వేసి వెళ్లారన్నారు. ఎన్నికల్లో అనేక మంది విలన్లను తట్టుకుని నిలబడ్డామని తెలిపారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అభివృద్ధిపథంలో నడిపించామని, తెలంగాణ కంటే మన ఆంధప్రదేశ్‌ అనేక రంగాల్లో ముందుందని చంద్రబాబు తెలిపారు. అధికారుల్లో చీలిక తెచ్చే ప్రయత్నాలు మంచివి కాదని, రాష్ట్రాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనేదే నా సంకల్పం అని చంద్రబాబు చెప్పారు. రాబోయే కాలంలో తెదేపాను మరింత బలోపేతం చేసేలా నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అబివృద్ధిని మరింత వేగవంతం చేస్తానని అన్నారు. ఏపీని దేశంలోనే నెం.1 రాష్ట్రంలోనిలిపే లక్ష్యంగా పాలన సాగిద్దామని అన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు.