ప్రధాని అయినా రాజీనామా చేయాల్సిందే
` ‘ఉద్వాసన’ బిల్లులపై అమిత్ షా వ్యాఖ్యలు
` అనారోగ్య కారణాలతోనే ధన్ఖడ్ తప్పుకున్నారని వెల్లడి
న్యూఢల్లీి(జనంసాక్షి):ముఖ్యమంత్రి అయినా.. ప్రధానమంత్రి అయినా జైలు నుంచే పరిపాలన చేయడం మంచి విషయమేనా? అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశ్నించారు. మన ప్రజాస్వామ్యానికి అది మర్యాదపూర్వకంగా ఉంటుందా? అంటూ విపక్షాలపై మండిపడ్డారు. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ‘ఏఎన్ఐ’కి అమిత్ షా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈసందర్భంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మాజీ ఉప రాష్ట్రపతి ధన్ఖడ్ రాజీనామా అంశం పైనా స్పందించారు.‘’విపక్షాలు ఇప్పటికీ కూడా జైలుకు వెళ్తే సులభంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేయగలమని అనుకుంటున్నారు. వారు జైలునే సీఎం, పీఎం అధికారిక నివాసాలుగా మార్చేస్తారు. అప్పుడు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ వంటి ఉన్నతాధికారులు జైలు నుంచే ఆదేశాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సిద్ధాంతాలను నేను, మా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. జైలు నుంచే ప్రభుత్వాలను నడిపే పరిస్థితి మన దేశంలో రాకూడదు’’ అని అమిత్ షా అన్నారు. ‘’ప్రధాని గానీ, ముఖ్యమంత్రి గానీ లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఏ నేత అయినా సరే.. ఏదైనా కేసులో అరెస్టయితే 30 రోజుల్లో బెయిల్ పొందాలి. లేదంటే తమతమ పదవులకు రాజీనామా చేయాలి. అలా చేయకపోతే.. చట్టమే వారిని తప్పించేలా 130వ రాజ్యాంగ సవరణను తీసుకొస్తున్నాం. చట్టమేదైనా ప్రభుత్వం, ప్రతిపక్షానికి ఒకేలా అమలవుతుంది. ఈ నిబంధన ప్రధాని పదవికి కూడా వర్తించేలా స్వయంగా నరేంద్రమోదీనే దీన్ని సవరణలో చేర్చారు. ఆయనకు కూడా ఇది వర్తిస్తుంది. ప్రధాని జైలుకెళ్తే ఆయనైనా రాజీనామా చేయాల్సిందే. ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ సవరణను తీసుకొస్తే దానిపై అభ్యంతరాలు లేవనెత్తే హక్కు అందరికీ ఉంటుంది. అంతేగానీ, పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశం లేకుండా ఆందోళనలు చేస్తే ఎలా?’’ అని ప్రతిపక్షాలపై హోంమంత్రి మండిపడ్డారు. ఈ బిల్లు కచ్చితంగా పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై విపక్షాల ఆరోపణలను అమిత్ షా తీవ్రంగా ఖండిరచారు. ఈ సందర్భంగా 2013 నాటి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. ‘’రాజ్యాంగ సవరణ బిల్లులో నైతికత లేదని విపక్షాలు అంటున్నాయి. నాడు లాలూ యాదవ్ను కాపాడేందుకు అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పత్రాలను రాహుల్ గాంధీ చింపేశారు. ఆ రోజే ఆయన నైతికతతో వ్యవహరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ రాజ్యాంగ సవరణపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోంది. వరుస వైఫల్యాలతో ఆ పార్టీ ఆలోచనావిధానం మందగించి ఉంటుంది’’ అని కేంద్రమంత్రి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. ‘’ధన్ఖడ్జీ రాజ్యాంగ పదవిలో కొనసాగారు. ఆయన పదవీకాలంలో ఎన్నో మంచి పనులు చేశారు. వ్యక్తిగత అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని మరీ ఎక్కువగా లాగొద్దు. కేవలం ప్రతిపక్షాల ఆరోపణల ఆధారంగా దీనిపై ఓ అంచనాకు రావడం సరికాదు’’ అని అమిత్ షా స్పష్టం చేశారు.త్వరలో జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి ప్రస్తావిస్తూ.. ‘’రాష్ట్రపతిని తూర్పు భారతం నుంచి ఎన్నుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి ఉండాలని అనుకున్నాం. దీనికి, తమిళనాడు ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదు’’ అని తెలిపారు.