ప్రభుత్వాస్పత్రుల్లో సురక్షితమైన కాన్పులు *మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ సుజాత

టేకులపల్లి, జూన్ 7( జనం సాక్షి):  ప్రభుత్వ ఆసుపత్రులలో సురక్షితమైన కాన్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించి ఉందని భద్రాద్రి జిల్లా మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ సుజాత అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో మంగళవారం జరిగిన ఆశా కార్యకర్తల శిక్షణ సమావేశానికి  హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  గర్భిణీ స్త్రీ ని త్వరగా గుర్తించి వెంటనే నమోదు చేసి కావాల్సిన పరీక్షలు అన్నీ చేపించి హైరిస్క్ గర్భిణులను గుర్తించి వారికి ప్రత్యేకమైన సేవలు చేయడం ద్వారా మాతా శిశు మరణాలను అరికట్టవచ్చు అని, ప్రతి గర్భిణీ స్త్రీ ని కనీసం నాలుగు సార్లు వైద్యాధికారి దగ్గర పరీక్షలు చేయించాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి గర్భిణీ ప్రసూతి కొరకు ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే తీసుకువెళ్లాలని లేనిచో చర్యలు తీసుకోబడును అని ఆశ కార్యకర్తలకు వివరించారు.  సాధ్యమైనంతవరకు పెద్ద ఆపరేషన్ లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో సురక్షితమైన కాన్పులు చేయడానికి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది అని చెప్పారు. అలాగే యుక్తవయసు బాలికల్లో రక్తహీనత ను గుర్తించి వారికి ప్రత్యేక చికిత్స అందించాలని కోరారు. ఈ సందర్భంగా మహిళల్లో రక్తహీనత  రాకుండా తీసుకోవాల్సిన పోషకాహారం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ, హెచ్ ఈ వో సత్యవతి, శకుంతల, నాగుబండి వెంకటేశ్వర్లు, పోరండ్ల శ్రీనివాస్, ఫార్మా సిస్టులు మంగీలాల్, ధర్మపురి రవికుమార్, అక్బర్, ల్యాబ్ టెక్నీషియన్ సాజీదా , ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.