బంగారం ధరలకు తోడు కరోనా ఎఫెక్ట్‌

ధంతేరాస్‌కు కలసిరాని కాలం

రానున్న పెళ్లిళ్ల సీజన్‌ కోసం వ్యాపారుల చూపు

ముంబై,నవంబర్‌13(జ‌నంసాక్షి): కరోనా తరువాత దేశంలో బంగారం కొనుగోలు పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌ కావడం, ధనత్రయోదశి పండగలు బంగారం కొనుగోళ్లు పెరిగాయి. దీంతో మెల్లగా మళ్లీ ధరలు పెరుగు తున్నాయి. బంగారం ధరలు స్థిరంగా ఉండడం లేదు. 50వేల మార్కును దాటిన తరవాత కిందికి దిగి రావడం లేదు. రాకుండా వ్యాపారులు కూడా తమవంతు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ, అటు వెండి ధరలు మాత్రం పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,200 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 గా ఉన్నది. ఇక కిలో వెండి ధర రూ. 500 పెరిగి రూ.63,300కి చేరింది. పరిశ్రమల యూనిట్లు, నాణెపు తయారీ పరిశ్రమల నుంచి డిమాండ్‌ పెరగడంతో వెండి ధర పెరిగింది. కరోనాతరవాత పుత్తడి ధరలు పెరగడంతో గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు కనీసం 30 నుంచి 50 శాతం తగ్గుతాయని మార్కెట్‌ వర్గాల అంచనా. అయితే దీపావళి, ధంతేరస్‌ పర్వదినాల సందర్భంగా కొనుగోళ్లు పుంజుకుంటాయని ఆభరణాల పరిశ్రమ ఆశిస్తోంది. రికార్డు స్థాయిలో ఎగిసిన పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో కస్టమర్ల తాకిడి ఆశాజనకంగా వుంటుందని భావిస్తున్నారు. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టి చర్చలు ప్రారంభించడం డాలర్‌కు బలాన్నిచ్చింది. దేశీయంగా రిటైల్‌ మార్కెట్లో కూడా బంగారం పెరుగుతోంది. దీంతో ధంతేరస్‌కు పసిడి లాభాల సిరులు కురిపిస్తుందనే అంచనాల్లో ఉన్నారు. దీపావళి అంటే దివ్వెలు, వెలుగుల సంబరం మాత్రమేకాదు. పసిడి కాంతుల కళకళలు కూడా. దసరా, దీపావళి పండుగ సీజన్‌ వచ్చిందంటే నగల వ్యాపారులకు బోలెడన్ని ఆశలు. లక్ష్మిదేవిని పూజించడం ఎంత ముఖ్యంగా భావిస్తారో… దీంతో పాటు బంగారం గానీ, ఏదో ఒక కొత్త వస్తువు కొనడం కూడా అంతే ఆనవాయితీ వస్తున్న క్రమంలో వారికి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఇటీవల రికార్డు స్థాయికి చేరిన పసిడి దరలు దీపావళి నాటికి దిగి వస్తాయా అని కొనుగోలుదారులు ఆశగా ఎదురుచూస్తోంటే.. కొనుగోళ్లతో తమ షాపులు కళకళ లాడతాయా లేదా అని వ్యాపారులు ఆందోళనపడుతున్నారు. కొనుగోలుదారుల విషయానికి వస్తే.. కొనుగోలుదారులు ఈ ధంతేరస్‌కు ఎంతో కొంత బంగారాన్ని తమ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. అయితే ఆకాశాన్నంటిన ధరలు మరింత దిగిరాకపోతాయా అనే విూమాంసలో చాలా మంది కొనుగోలు దారులున్నారు. దీనికి తోడు స్పాట్‌ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగినప్పటికీ భవిష్యత్తులో మాత్రం భారీగా తగ్గే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు అంచనాలు వారి ఊహలకు రెక్కలు తొడుగుతున్నాయి. క్షణ క్షణానికి మారుతున్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పుత్తడి ధర ఏ రోజు ఎంత పెరుగుతుందో.. ఎంత తగ్గుతుందో అంచనా వేయడం ఒకింత కష్టంగా మారింది. ఇదిలా ఉంటే అంతర్జాతీయ పరిస్థితులు, గ్లోబల్‌గా ఆర్థిక వ్యవస్థ మందగమనం, ట్రేడ్‌వార్‌ తదితర కారణాల రీత్యా మొత్తం వ్యాపారం గత సంవత్సరంతో పోలిస్తే తక్కువగా ఉంటుందని వ్యాపారులు అంటున్నారు. తక్కువ నుండి మధ్య స్థాయి వరకు జరిగే కొనుగోళ్లు తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పారు. ధరలు పెరిగినా రానున్న పెళ్లిళ్ల సీజన్‌ కూడా తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ప్రకటించిన అధిక బోనస్‌ కూడా డిమాండ్‌ పెంచడానికి దోహదపడుతుందని తెలిపారు. దీంతోపాటు తమ దీపావళి స్పెషల్‌ కలెక్షన్‌కు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందన్నారు.