బంగ్లాలు ఖాళీ చేయండి

మాజీ సిఎంలకు సర్కార్‌ నోటీసులు
లక్నో,మే18(జ‌నం సాక్షి ):  ఉత్తరప్రదేశ్‌లోని ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపించింది. లక్నోలోని అధికారిక భవనాలను 15రోజుల్లోగా ఖాళీ చేయాలని తెలిపింది. యూపీలోని మాజీ ముఖ్యమంత్రులు అధికారిక భవనాలను ఖాళీ చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మాజీ సీఎంలలో సమాజ్‌ వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌, సమాజ్‌ వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీ చీఫ్‌ మాయావతి, ఎన్డీ తివారి, భాజపా నేతలు రాజ్‌నాథ్‌ సింగ్‌, కల్యాణ్‌ సింగ్‌లు ఉన్నారు.బుధవారం ములాయం సింగ్‌ ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలవగా.. గురువారం మాజీ సీఎంలకు నోటీసులు జారీ అవ్వడం గమనార్హం. ములాయం, యోగి మధ్య జరిగిన సమావేశంలో విక్రమాదిత్య మార్గ్‌లో ములాయంకు, ఆయనన కుమారుడు అఖిలేశ్‌కు కేటాయించిన బంగ్లాల విషయంపై చర్చించినట్లు సమాచారం. ఆ బంగ్లాలను విధానసభ ప్రతిపక్ష నేతకు, విధాన పరిషత్‌ ప్రతిపక్ష నేతకు కేటాయించాలనే విషయం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. కానీ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.