బిజెపికి ఓటమి భయం పట్టుకుంది

మోడీ ఆవేశపూరిత వ్యాఖ్యలే నిదర్శనం
ఘాటుగా జవాబిచ్చిన రాహుల్‌
బెంగళూరు,మే10(జ‌నం సాక్షి): మోదీకి చాలా ఆవేశం ఉంది. నాపైనే కాదు అందరిపైనా ఆయన తన ఆగ్రహాన్ని వెల్లగక్కుతారు. నన్ను చూసి ఆయన భయపడుతున్నారు కాబట్టే ఆ ఆగ్రహాన్ని నాపై కూడా చూపిస్తున్నారు. కానీ ఆయన ఆవేశమే ఆయన సమస్య. అది నా సమస్య కాదు అని రాహుల్‌ అన్నారు. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా తనపై వ్యక్తిగత దాడి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దీటుగా బదులిచ్చారు. తన తల్లి సోనియాగాంధీ ఇటాలియన్‌ అయినా.. ఎక్కువ కాలం ఇండియాలోనే ఉన్నారని, ఇక్కడున్న ఎంతోమంది భారతీయుల కంటే కూడా ఎక్కువ భారతీయత ఆమె సొంతమని రాహుల్‌ అన్నారు. ఈ దేశం కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు.. ఎన్నో బాధలు అనుభవించారు అని రాహుల్‌ చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలతో మోదీ తానేంటో నిరూపించుకున్నారు. అలా మాట్లాడటమే ఆయనకు ఇష్టమైతే మాట్లాడనివ్వండి. నాకు వచ్చిన ఇబ్బందేవిూ లేదు అని రాహుల్‌ ఘాటుగా స్పందించారు. రాహుల్‌ పరిపక్వత లేని మనిషి అని, ఇంటిపేరుతో నెట్టుకొస్తున్నారన్న మోదీ విమర్శలపై స్పందిస్తూ.. బుద్దుడి గురించి ప్రస్తావించారు. ఓ ఆవేశం కలిగిన మనిషి తిట్లపై ఏమాత్రం స్పందించని బుద్దుడు తన శిష్యులతో ఇలా చెప్పాడు. ఆయన నాకు ఆవేశాన్ని బహుమానంగా ఇచ్చారు. కానీ నాకు అది అవసరం లేదు. అందుకే తీసుకోలేదు అని బుద్దుడు చెప్పాడంటూ రాహుల్‌ గుర్తుచేశారు.  బీజేపీకి భయం పట్టుకుంది అనడానికి మోదీ మాటలే నిదర్శనమని రాహుల్‌ చెప్పారు. ప్రచారంలో మోదీ మొత్తం నాపైనే దృష్టిసారించడం కర్ణాటక ప్రజలకు అవమానం. ఈ ఎన్నికలు రాహుల్‌ కోసం కాదు. ఇప్పుడు నాకు ప్రధాని గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఆయనకు స్పందించడం రాకపోతే ఇలా అంశాన్ని పక్కదోవ పట్టిస్తారు అని రాహుల్‌ గాంధీ అన్నారు.