బిహార్లో దారుణం
– బాలికపై ప్రిన్సిపల్తో సహా 18మంది అఘాయిత్యం
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
– ప్రిన్సిపల్, ఓ ఉపాధ్యాయుడిన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
– మిగిలిన నిందితుల కోసం గాలింపు
చాప్రా, జులై7(జనం సాక్షి) : దేశంలో మహిళలు, బాలికలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. దేశంలో ఏదోఒక ప్రాంతంలో అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా వీటిక ప్రభుత్వాలు వీటికి స్వస్తి చెప్పలేక పోతున్నాయి. తాజాగా బిహార్లోని సరన్ జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదమూడేళ్ల బాలికపై ఏకంగా 18 మంది ఏడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు కూడా ఉండడం మరీ దారుణం. ఏడు నెలల సమయంలో తనపై పాఠశాల ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులు, 15 మంది విద్యార్థులు అఘాయిత్యం చేశారని బాలిక ఎక్మా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. తనను బెదిరించి పలు మార్లు సామూహిక అత్యాచారాలు చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత ఏడాది డిసెంబరులో తన తండ్రి జైలుకు వెళ్లినప్పటి నుంచి తనపై ఈ అఘాయిత్యాలు మొదలయ్యాయని చెప్పింది. ఫిర్యాదులో 18 మంది పేర్లను వెల్లడించింది. తన క్లాస్మేట్ మొదట అత్యాచారం చేసి ఎవ్వరికీ చెప్పొద్దని బెదిరించాడని, ఆ తర్వాత మరో నలుగురైదుగురు విద్యార్థులు అఘాయిత్యం చేశారని చెప్పింది. వాళ్ల తర్వాత పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు తనపై అత్యాచారాలు చేస్తూ వచ్చారని తెలిపింది. తన తండ్రి జైల్లో నుంచి విడుదలయ్యే వరకూ ఏడు నెలల పాటు వారి కిరాతకాలు కొనసాగాయని బాలిక ఫిర్యాదులో పేర్కొంది. ఎక్మా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం పాఠశాల ప్రిన్సిపల్ను, ఓ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాలికను వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.