బీజేపీ నేత బ్రెయిన్‌ డెడ్‌.. 

– అవయవాలు దానం చేసిన కుటుంబం
భోపాల్‌, జులై7(జ‌నం సాక్షి) : స్నేహితురాలిపై తన ‘ప్రేమను నిరూపించుకునేందుకు’ ఇటీవల తుపాకీతో కాల్చుకున్న బీజేపీ యువనేత బ్రెయిన్‌ డెడ్‌కు గురైనట్టు డాక్టర్లు ప్రకటించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయువాలు పలు ఆస్పత్రులకు దానం చేశారు. భోపాల్‌కి చెందిన బీజేపీ యువ మోర్చా నాయకుడు అతుల్‌ లోఖండే (30) ఈ నెల 3న తనను తాను కాల్చుకున్న సంగతి తెలిసిందే. అతుల్‌ బ్రెయిన్‌ డెడ్‌కు గురికావడంతో  శనివారం ఆయన గుండెను వేరుచేసి ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి దానం చేశారు. గుండెను తరలిస్తున్న సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా హాస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటుచేశారు. లివర్‌, కిడ్నీలను భోపాల్‌లోని మూడు ప్రయివేట్‌ ఆస్పత్రులకు పంపగా, కళ్లను హమిదియా ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. కాగా అతుల్‌ తనను కాల్చుకోబోయే గంట ముందు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. 13 ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పాననీ… అయితే తన ప్రేమను నిరూపించుకునేందుకు తుపాకితో కాల్చుకోవాలని ఆయన కోరాడన్నారు. ‘నీది నిష్కళంకమైన ప్రేమే అయితే తుపాకితో కాల్చుకో.. నువ్వు బతికితే పెళ్లిచేస్తా. చనిపోతే వచ్చే జన్మలో ఇద్దరూ ఒకటవుతారు’ అని చెప్పాడని అతుల్‌ పేర్కొన్నాడు. ‘ఒకవేళ నేను చనిపోతే నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లు. నేను బతికితే, నేనే విూ ఇంటికి వస్తా…’ అని ఆమె తండ్రినుద్దేశించి అతుల్‌  పేర్కొన్నాడు. మరిన్ని కులాంతర వివాహాలు, మరిన్ని మతాంతర వివాహాలు జరగాలనీ… భారత్‌ మరింత సహజమైన దేశంగా రూపుదిద్దుకోవాలని అతడు తన సందేశంలో ఆకాంక్షించడం గమనార్హం.