భార్య ప్రేమ కోసం భర్తత్యాగం
ప్రేమించిన వ్యక్తి కోసం విడాకులకు సిద్దం
బోపాల్లో విచిత్ర ఘటన
భోపాల్,నవంబర్26(జనం సాక్షి): ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతాం.. అలాగే ఓ భర్త తన భార్య ప్రేమ కోసం విడాకులకు సిద్దం అయ్యాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్కు చెందిన మహేశ్, సంగీతకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. మహేశ్ సాప్ట్వేర్ ఇంజినీర్ కాగా, సంగీత ఫ్యాషన్ డిజైనర్. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే సంగీత పెళ్లి కంటే ముందే ఓ యువకుడిని ప్రేమించింది. కానీ వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. చేసేదేవిూ లేక మహేశ్ను సంగీత వివాహం చేసుకుంది. తల్లిదండ్రుల గౌరవం కోసం మహేశ్ను పెళ్లి చేసుకున్న సంగీత.. తన సంసార జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే తను ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోలేదని.. తానే జీవితమని బతుకుతున్నాడని సంగీతకు తెలిసింది.
ఆమె జీవితంలో ఊహించని విధంగా.. ప్రియుడి గురించే ఆలోచించడం.. అతడిని కలవరించడం మొదలయ్యాయి. ఈ క్రమంలో మూడు, నాలుగేళ్ల నుంచి సంగీత, మహేశ్ మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. తన భార్య ప్రేమను అర్థం చేసుకున్న మహేశ్.. ఆమెకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు మహేశ్. మహేశ్తో విడాకులు తీసుకునేందుకు కూడా సంగీత ఒప్పుకుంది. ఇద్దరు పిల్లల సంరక్షణ తానే చూసుకుంటానని మహేశ్ చెప్పాడు. ఇందుకు కూడా సంగీత అంగీకరించింది. అయితే పిల్లలను చూడాలని అనిపిస్తే ఎప్పుడైనా రావొచ్చు అని పెద్ద మనసుతో సంగీతకు చెప్పాడు మహేశ్. మొత్తానికి తాను మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తి వద్ద తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్న సంగీతకు త్వరలోనే మహేశ్ విడాకులు ఇవ్వనున్నాడు.