భూసేకరణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అన్నా దీక్ష

జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష
న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జ‌నంసాక్షి): భూ సేకరణ ఆర్డినెన్స్‌ ను వ్యతిరేకిస్తూ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హాజారే ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద దీక్ష చేపట్టారు. రైతులను ముంచేదిగా ఉన్న ఆర్డినెన్స్‌ను రద్దు చేయాలని అన్నా డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా అన్నా మాట్లాడుతూ రైతుల గొంతును వినిపించేందుకు నిరసన దీక్ష చేపట్టినట్లు, భూ సేకరణ ఆర్డినెన్స్‌ అవసరం లేదన్నారు. రైతులను కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, కేంద్ర వైఖరి చూస్తుంటే ఈ ప్రభుత్వానికి ఆంగ్లేయులుకు తేడా లేదనిపిస్తోందని ఘాటుగా విమర్శించారు. ఇది రైతులను మోసంచేసే చర్యని అన్నారు. ఇలాంటిచట్టాలు వద్దన్నారు. ప్రజలకు మేలు చేసే విదంగా పాలన చేయడంలో బిజెపి విఫలమయ్యిందన్నారు. రైతులకు మద్దతుగా గ్రామాల్లో చైతన్యం కార్యక్రామలు చేపడతామని అన్నారు.  అంతేగాకుండా కార్పోరేట్‌ సంస్థలకు కొమ్ము కాస్తోందని ఘాటుగా విమర్శించారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకంగా పోరాడేందుకు సామాజిక కార్యకర్త అన్నా హాజారేతో పాటు పలువురు సామాజిక కార్యకర్తలు  సిద్ధమయ్యారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద రెండు రోజుల పాటు ధర్నా చేయనున్నారు. భూసేకరణ చట్టంలో తీసుకువచ్చిన మార్పులను వ్యతిరేకిస్తూ హజారే ధర్నా నిర్వహించనున్నారు. అనేక వ్యవసాయ సంఘాలు, మేధాపాట్కర్‌ లాంటి సామాజిక కార్యకర్తలు ఈ నిరసనకు మద్దతు ప్రకటించారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ రైతు వ్యతిరేకంగా ఉందంటూ హజారే విమర్శించారు. మోడి సర్కార్‌ రైతులకు బాసటగా లేదని, కార్పోరెట్‌ పక్షాన్నే ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పట్కర్‌ స్పష్టం చేశారు. కార్పోరెట్‌ల కోసం చట్టాల్లో కూడా మార్పు తెచ్చే యత్నం జరుగుతోందన్నారు. అన్నాహజారే దీక్షకు ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆమె విమర్శించారు. అయినా వేలాదిగా రైతులు తరలి రానున్నారని మేధాపట్కర్‌ తెలిపారు.ఈ ధర్నాలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.