భూసేకరణ, తదితరబిల్లుపై ప్రతిఘన తప్పకపోవచ్చు
అనూహ్యంగా ప్రభుత్వ విధానాలపై బిఎంఎస్ విమర్శలు
న్యూఢిల్లీ,ఫిబ్రవరి20( జనంసాక్షి) : భూసేకరణ బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశల్లో దీనిపై గట్టిగా పోరాడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు వామపక్షాలు దీనిపై తీవ్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్ భూసేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తున్నా ఎలాంటి పోరాటం చేయబోతుందో చెప్పడం లేదు. ఇక ఎన్డిఎ విశానాలపై బిఎంసె కూడా మండిపడుతోంది. ఆర్థిక, కార్మిక సంబంధిత విధానాల్లో కార్పొరేట్ రంగానికి అనుచిత లబ్ది కలిగిస్తూ సామాజిక రంగాన్ని కేంద్రం తీవ్రంగా విస్మరిస్తోందని బిజెపి అనుబంధ కార్మిక సంఘం- భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆరోపించింది. ప్రభుత్వం తప్పుడు మార్గంలో వెళుతందని నిందించింది.ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న దేశవ్యాప్తంగా సత్యాగ్రహాలు నిర్వహించనున్నట్లు బీఎంఎస్ తెలిపింది. నూతన భూసేకరణ చట్టంలో తీసుకువచ్చిన మార్పులపై ఆందోళన వ్యక్తం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రాచుర్యం కల్పించే ఉద్దేశంతోనే ‘భారత్లో తయారీ’ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించింది. దేశ కార్మిక చరిత్రలో మునుపెన్నడూ లేనిరీతిలో- కార్మిక సంఘాలతో చర్చించకుండానే ముఖ్యమైన మార్పుల్ని చేస్తున్నారని నిందించింది. ఇదో రకంగా బిజెపిని ఇరుకోల పెట్టే అంశంగానే భావించాలి. కేంద్రంలోబిజెపి ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఇంతవరకు ఎన్డీయేతర పార్టీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈ సమావేశాల్లో అనుసరించే వ్యూహంపై తమ అధ్యక్షురాలు సోనియాగాంధీ నుంచి ఎటువంటి ప్రణాళిక వెలువడలేదని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత ¬దా పొందేందుకు కావాల్సిన స్థానాల్ని కాంగ్రెస్ దక్కించుకోలేదు. కాంగ్రెస్ 44 స్థానాలను సాధించుకోగా, ఏఐడీఎంకే 37, బీజేడీ 20, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 34 మంది ఎంపీలను గెలుచుకుంది. స్థిరమైన ప్రతిపక్షమంటూ ఏదీ లేకపోవడంతో విపక్షాలన్ని చెల్లాచెదురుగా ఉన్నాయి. అయితే ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని కాంగ్రెస్ను భాజపా కోరిందన్న వార్తల్ని కాంగ్రెస్ వర్గాలు కొట్టిపారేశాయి. కాంగ్రెస్, జేడీయూ, వామపక్షాలు వివాదాస్పద భూసేకరణ ఆర్డినెన్స్ను వ్యతిరేకించేందుకు ఉమ్మడిగా పోరాడే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లో ఆరు ఆర్డినెన్స్ల స్థానంలో బిల్లులను కేంద్ర సర్కారు ప్రవేశపెట్టనుంది. వీటి ఆమోదం విషయంలో భాజపాకు సొంతంగా సంపాదించుకున్న ఆధిక్యతకు తోడు, మిత్రపక్షాలతో కలిసి ఆ పార్టీ సంఖ్యాబలం మరింతగా పెరిగింది. అయితే రాజ్యసభలో మాత్రం పూర్తిస్థాయి మెజారిటీ లేకపోవడంతో భాజపాకు ఇబ్బందులు తప్పవు. ఈ దశలో ఉభయ సభల ఉమ్మడి సమావేశాల ద్వారా బిల్లు ఆమోదానికి సర్కార్ యోచిస్తోంది. అయితే బిఎంఎస్ చేస్తున్న విమర్శలను ఏ రకంగా తీసుకుంటుందన్నది చూడాలి. అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే బిజెపి ప్రభుత్వం కార్మికులు, సాధారణ పౌరులు, దిగువ మధ్య తరగతి కుటుంబాలు, గ్రావిూణులు, రైతులు… ఇలా అన్ని వర్గాల వారినీ ప్రభుత్వం నిరుత్సాహానికి గురి చేసిందని విమర్శించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి బి.ఎం.ఎస్. ఒక లేఖ రాసింది. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా కార్మిక, ఆర్థిక సంస్కరణలు చేపడుతున్నారనీ, జాతీయ సంపదను ప్రైవేటు కార్పొరేట్ రంగానికి అప్పగించేందుకే ఇవన్నీ చేస్తున్నారని దానిలో ఆరోపించింది. అమెరికాకు చెందిన ఎన్నారై సలహాదారులు, కార్పొరేట్ రంగానికి అనుకూలురైన మంత్రుల వద్దే అధికారం కేంద్రీకృతమయిందని తెలిపింది. నితి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, ఆర్థిక సలహాదారుడు, రిజర్వ్ బ్యాంకు గవర్నర్ తదితరులను దీనికి ఉదాహరణగా ప్రస్తావించింది. మొత్తంగా బిజెపి విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవన్న విమర్శలు స్వపక్షం నుంచే రావడంతో పద్దతి మార్చుకుంటుందా అన్నది చూడాలి.