మంత్రివర్గంలో కోవర్టులు.. సాగనంపండి!

మాజీ యువజకాంగ్రెస్‌ అధ్యక్షుడు సుధాకర్‌బాబు
హైదరాబాద్‌, ఆగస్టు 6 : మంత్రివర్గంలో ఏడుగురు కోవర్టులు ఉన్నారని యువజన కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు ఆరోపించారు. సోమవారంనాడు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు స్పష్టం చేశామని తెలిపారు. నేటి ఉదయం బొత్సను కలిసి విషయాలన్నీ వివరించామన్నారు. ఆ ఏడుగురి కాల్స్‌ లిస్టును తెప్పించుకుని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పామన్నారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో జగన్‌ పార్టీ కోవర్టులున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అలాగే ఎమ్మెల్సీల్లోను, ఎమ్మెల్యేల్లోను కోవర్టులున్నారని ఆరోపించారు. వారిపై పది రోజుల్లోగా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్టు హెచ్చరించారు. కాంగ్రెస్‌ పార్టీలో జగన్‌ పార్టీ కోవర్టులున్నారని తెలిసినప్పటికీ కేంద్రం పెద్దలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. పార్టీలోనే ఉన్న వారు జగన్‌ పార్టీ ఎమ్మెల్యేల పనులను చేసి పెడుతున్నారన్నారు. దీని వల్ల కాంగ్రెస్‌ పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు. పైగా వారందరూ జగన్‌ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్నారని ఆరోపించారు.