మంత్రులకు అవగాహన లేదు

మహబూబ్‌నగర్‌ : రాష్ట్రంలో తుపాను ప్రభావంతో రాకపోకలు స్తంభించినా మంత్రులకు కనీస అవగాహన లేదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయడు విమర్శించారు. నీలం తుపాను ధాటికి రాష్ట్రం వరద బారిన పడగా ప్రజలకు సాయమందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా మంగళవారం జిల్లాలోని నారాయణపేట నియోజకవర్గంలో బాబు మాట్లాడారు. రాష్ట్రంలోని వరదబాధిత ప్రాంతాల్లో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ పర్యటించాలని బాబు అన్నారు. ప్రకృతి వైపరీత్యాలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తాము అధికారంలో ఉండగా కోస్తాలో ఇలాంటి విపత్తు సంభవించినప్పుడు సచివాలయాన్ని రాజమండ్రికి తరలించి ప్రజలకు అండగా నిలిచామని గుర్తుచేశారు. ప్రస్తుత వరద బాధిత ప్రాంతాల్లో కంట్రోల్‌ రూమ్‌లను సైతం సక్రమంగా నెలకొల్పలేకపోయారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు మంత్రులంతా పెళ్లిళ్లు, ఢిల్లీ పర్యటనలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌లో చంద్రబాబు 12వ రోజు పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం ధన్వాడ మండలం రామకృష్ణాపురం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.