మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం
ఒకే కుటుంబానికి చెందిన 12మంది మృతి
భోపాల్, జూన్21(జనం సాక్షి) : మధ్యప్రదేశ్లోని మోరెనా ప్రాంతంలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న జీపును ఇసుక ట్రాక్టర్ వేగంగా ఢీకొట్టడంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం విషాదకరం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్వాలియర్కు చెందిన కొందరు తమ బంధువు మృతిచెందడంతో జీపులో అంత్యక్రియలకు బయల్దేరారు. మార్గమధ్యంలో గంజమపూర్ వద్ద మలుపు తిరుగుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. రెండు వాహనాలు చాలా వేగంగా ఢీకొన్నాయని, దీంతో జీపు ఇసుక ట్రాక్టర్ కిందకు దూసుకుపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి.. జీపులో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.