మన్మోహన్‌ను ప్రశ్నించిన సీబీఐ?

akshaya

న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల స్కాం కేసుకు సంబంధించి మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను సీబీఐ ప్రశ్నించినట్లు అభిజ్ఞవర్గాలు చెప్తున్నాయి. హిందాల్కో సంస్థకు బొగ్గు క్షేత్రాల కేటాయింపుకు సంబంధించి మన్మోహన్‌ను రెండు రోజుల కిందట ఆయన నివాసంలో ప్రశ్నించినట్లు ఆ వర్గాల సమాచారం. మన్మోహన్ ప్రధానిగా ఉన్న కాలంలో బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఆయన పర్యవేక్షణలో ఉన్నపుడు తాలాబిరా-2 బొగ్గు క్షేత్రాన్ని హిందాల్కోకు కేటాయించటంపై ఆయనను విచారించినట్లు తెలుస్తోంది.

అయితే.. ఈ వార్తలపై సీబీఐ అధికార ప్రతినిధి కంచన్‌ప్రసాద్‌ను సంప్రదించగా ఆయన ధ్రువీకరించటానికి కానీ, తిరస్కరించటానికి కానీ నిరాకరించారు. మన్మోహన్‌సింగ్ సహాయకులు మాత్రం అటువంటిదేమీ లేదని తిరస్కరించారు. ఈ కేసులో వివిధ కోణాలపై అప్పటి బొగ్గు శాఖ మంత్రి (మన్మోహన్‌సింగ్)ను విచారించకుండా.. కేసులో తుది నివేదికను అంగీకరించబోమని ప్రత్యేక న్యాయమూర్తి భరత్‌పరాశర్ పేర్కొన్న విషయం తెలిసిందే. బొగ్గు స్కాంపై దర్యాప్తునకు సంబంధించిన స్థాయీ నివేదికను సీబీఐ ఈ నెల 27వ తేదీన ప్రత్యేక కోర్టుకు సమర్పించాల్సి ఉంది.