మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ది: రామలింగారెడ్డి

 

సిద్దిపేట,నవంబర్‌6(జ‌నంసాక్షి): కులవృత్తులను గుర్తించి వారికి పెదో/-దపీట వేసి అభివృద్ది కార్యక్రమాలను చేపడితే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్తి రామలింగారెడ్డి అన్నారు. 70 ఏండ్ల సీమాంధ్ర పాలనలో ఏనాడు, ఏ పార్టీ వివిధ కులస్తులను గుర్తించలేదన్నారు. వారికి అండగా కులవృత్తులకు ప్రోత్సాహం ఇచ్చిన ఏకైక నేత కెసిఆర్‌ అన్నారు. ఆడబిడ్డలకు తోబుట్టువుగా, చిన్నారులకు మేనమామగా, రైతన్నలకు పెద్దన్నగా నిలిచి వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్న సీఎం కేసీఆర్‌ గొప్ప మానవతావాది అని అన్నారు. పంటలకు పెట్టుబడికి సాయంతో పాటు రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబ రోడ్డున పడకుండా రూ. 5 లక్షల భీమా వర్తింప చేస్తున్నారన్నారు.బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్నే గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది ఆత్మబలిదానం చేసుకున్నారని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలంటే గులాబీ పార్టీకే ఓటు వేయాలన్నారు.అభివృద్ధిని చూసి తిరిగి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు.