మహారాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం
– నిబంధనలు సడలించాలని కంపెనీల ఒత్తిడి
ముంబాయి, జూన్29(జనం సాక్షి) : మహారాష్ట్రలో ప్లాస్టిక్ పై నిషేధం విధించడంతో బహుళ జాతి సంస్థలు ఇబ్బందులు పడుతున్నాయి. వాడి పడేసే ప్లాస్టిక్ వినియోగం విషయంలో నిబంధనలు కాస్త సడలించాలని అమెజాన్, హెచ్ అండ్ ఎం లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ప్రభుత్వం వద్ద లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. గత వారం మహారాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధాన్ని అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థలకు వస్తువుల డెలివరీ ప్యాకింగ్కు బాగా ఖర్చు అవుతోంది. రిటైలర్స్, శీతల పానీయాలు తయారీదారులకు, మంచినీళ్ల బాటిళ్ల అమ్మకందారులపై ఈ నిషేధం ఎఫెక్ట్ బాగా పడుతోంది. దీంతో ఆయా కంపెనీలు ప్లాస్టిక్ వాడకంపై విధించిన నిబంధనల్లో మార్పులు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్, హెచ్ అండ్ ఎం, కోకా కోలా సహా పలు కంపెనీల ప్రతినిధులతో పాటు కొన్ని ప్లాస్టిక్ పరిశ్రమ సంఘాలు ప్లాస్టిక్ నిషేధం అమలు చేయడానికి ముందు రోజే మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను కలిశారు. నిబంధనలను దశల వారీగా అమలు చేయాలని, కొన్ని నిబంధలనల్లో సడలింపు ఇవ్వాలని అధికారులను కోరినట్లు సమాచారం. పరిశ్రమలకు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకునేందుకు ఏడేళ్ల సమయం ఇవ్వాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు భారత ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారీదారుల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నీమిత్ మునమియా వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, కోకా కోలా కంపెనీలు ఈ అంశంపై స్పందించడానికి నిరాకరించాయి. ప్లాస్టిక్ రీసైకిల్, పునర్వినియోగానికి తాము మద్దతు ఇస్తామని హెచ్ అండ్ ఎం కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. మున్ముందు పరిష్కార మార్గాలను చూసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని కోరింది. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో సగం వరకూ ప్లాస్టిక్ ప్యాకింగ్ల వల్ల కలుగుతోందని, వాటిని ఒకసారి ఉపయోగించిన వెంటనే బయట పడేస్తున్నారని ఐరాస ఓ నివేదికలో వెల్లడించింది.