మార్చ్‌ వాయిదాకు మంత్రులు సీఎంకు సహకరించొద్దు

ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు పెట్టాలని చూస్తే ఖబర్దార్‌ : హరీశ్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి):
హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ మార్చ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని, అడ్డుకోవడం సరికాదని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. మార్చ్‌ని అడ్డుకోవాలని చూస్తే తాము ప్రత్యామ్నాయాలు చూసుకుంటా మన్నారు. మార్చ్‌ను అడ్డుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రికి సహకరిస్తే జరిగే పరిణామాలకు తెలంగాణ మంత్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌లో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. తెలంగాణ వాదులను కవ్వించేందుకు ట్యాంక్‌ బండ్‌పైన విగ్రహాలను పున:ప్రతిష్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. విగ్రహాల పెట్టి చూస్తే అవి ఉంటాయో ఊడుతాయో తెలుస్తుందని హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణ వాదులను రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆయన తన వైఖరిని మార్చుకోవాలని సూచించారు.