మావోయిస్టులు అభివృద్ధిలో భాగస్వామ్యంకండి

` జనజీనన స్రవంతిలోకి రండి
` విధినిర్వహణలో ఎందరో పోలీసుల ప్రాణత్యాగం.. వారిని సంస్మరించుకోవడం మన విధి
` అమరుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం
` కానిస్టేబుల్‌ ప్రమోద్‌ కుటుంబానికి రూ.కోటి పరిహారం, 300 గజాల ఇంటిస్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పదవీవిరమణ
వరకు జీతం చెల్లింపు
` ఈగిల్‌ టీమ్‌తో డ్రగ్స్‌ ముఠా ఆటకట్టు..
` పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):పోలీస్‌ అంటేనే సమాజానికి ఒక నమ్మకం, భరోసా అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వచ్చినా పోలీస్‌ వెనుకడుగు వేయడని చెప్పారు. ఒకవైపు నెత్తురు చిందుతున్నా… మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. హైదరాబాద్‌ గోషామహాల్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్‌ ప్లాగ్‌ డే పరేడ్‌ కార్యక్రమానికి సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నూతన పోలీస్‌ అమరవీరుల స్మారక స్థూపాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్‌ అమరవీరులకు సీఎం నివాళులు అర్పించారు. విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమర వీరులను స్మరించుకోవడం మనందరి కర్తవ్యమని సీఎం వ్యాఖ్యానించారు. ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతీ సంవత్సరం ’అక్టోబరు 21’న ’పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం’గా ఘనంగా నిర్వహించు కుంటున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు అమరవీరులకు శ్రద్దాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసులకు శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ’అమరులు వారు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించి.. తొలి ప్రతిని డీజీపీ శివధర్‌కు అందించారు. అమరులైన పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇటీవల చనిపోయిన ప్రమోద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా సాయం చేస్తాం. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటిస్థలం కేటాయిస్తున్నాం. పలు విభాగాల్లో మన పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. డ్రగ్స్‌ మహమ్మారిపై పోరాడేందుకు ఈగల్‌ పేరుతో బృందాలను నియమించాం. ఇటీవల అనేక మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవాలని మిగతా మావోయిస్టులనూ కోరుతున్నానని సీఎం తెలిపారు. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్‌ సిబ్బంది, తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారని గుర్తు చేశారు.గ్రేహౌండ్స్‌ కమాండోలు.. టి. సందీప్‌, వి.శ్రీధర్‌, ఎన్‌. పవన్‌ కళ్యాణ్‌లు సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందారని చెప్పారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ బానోతు జవహర్లాల్‌, నల్గొండ కానిస్టేబుల్‌ బి.సైదులు విధినిర్వహణలో మరణించారని అన్నారు. మూడు రోజుల కింద నిజామాబాద్‌లో సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ఎంపల్లి ప్రమోద్‌
కుమార్‌ విధి నిర్వహణలో వీర మరణం చెందారని గుర్తుచేశారు. భర్త ప్రమోద్‌ ను పోగొట్టుకున్న అతని భార్య ప్రణీతకు, అతి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన అతని ముగ్గురు కుమారులకు, వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హావిూ ఇచ్చారు. ఒక కోటి రూపాయలు ఎక్స్‌ గ్రేషియా, అమరుడైన కానిస్టేబుల్‌ పదవీ విరమణ వరకు లాస్ట్‌ పే డ్రాన్‌ సాలరీతో పాటు కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు పోలీస్‌ భద్రత సంక్షేమం నుండి రూ.16 లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పోలీస్‌ వెల్ఫేర్‌ నుండి రూ.8 లక్షలు ఎక్స్‌ గ్రేషియాను ప్రమోద్‌ కుటుంబానికి చెల్లించి వారి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. 29`06`2008 న ఒరిస్సాలో మావోయిస్టుల దాడిలో మరణించిన 33 మంది పోలీస్‌ కుటుంబాలకు గాజులరామారంలో 200 గజాల స్థలం కేటాయించామన్నారు. తెలంగాణ పోలీస్‌ శాఖ అవలంబిస్తున్న విధానాలు, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రాష్ట్ర పోలీస్‌ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం మా ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీస్‌ శాఖకు ప్రథమ స్థానం లభించిందని ట్‌ తెలిపారు. అదేవిధంగా, పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌ విధానంలోనూ విదేశాంగ శాఖ నుంచి ప్రత్యేక అభినందనలు పొందిందని చెప్పారు. ఈ విజయాలు తెలంగాణ పోలీస్‌ సిబ్బంది నిరంతర కృషి, అంకితభావానికి నిదర్శనమని చెప్పారు. ఇలాగే, ప్రజల భద్రత, శాంతిని కాపాడుతూ, తెలంగాణ పోలీస్‌ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తీవ్రవాదం, ఉగ్రవాదం, సంఘ విద్రోహ కార్యకలాపాలు, మతతత్వ ఆందోళనలు, వైట్‌ కాలర్‌ నేరాలు, మాదకద్రవ్యాలు, సైబర్‌ నేరాలు, కల్తీ ఆహారాలు, గుట్కాలు, మట్కాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు రాష్ట్రంలో పెరగనివ్వకుండా అహర్నిశలు శ్రమిస్తూ తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. నేరం చేసి తప్పించుకోలేమన్న పరిస్థితిని సృష్టించడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పెంచిన తెలంగాణ పోలీస్‌ శాఖను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తెలంగాణలో డ్రగ్స్‌ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ’ఈగల్‌’ వింగ్‌ సమర్థవంతంగా తన బాధ్యతలు నిర్వర్తిస్తుంది. తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మా ప్రభుత్వ సంకల్పం అని అన్నారు. డ్రగ్స్‌ దందా వెనక ఎంతటి వారున్నా వదిలిపెట్టొద్దు అనే ఆదేశాలను జారీ చేశాం. ఒకప్పటితో పోలీస్తే నేరాల స్వభావం మారుతోంది.
సైబర్‌ నేరాలు, డిజిటల్‌ మోసాలు, మార్ఫింగ్‌ కంటెంట్‌, డ్రగ్స్‌, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వంటి కొత్త తరహా నేరాలు పోలీసులకు సవాలుగా మారుతున్నాయి.మానవ నేరాలను మించి సైబర్‌ కైమ్ర్‌ వార్తలు పత్రికల్లో ఎక్కువ కనిపిస్తున్నాయి.టెక్నాలజీ రూపంలో ఎదురవుతున్న సవాళ్లకు టెక్నాలజీతోనే తెలంగాణ పోలీసులు సమాధానం చెబుతున్న తీరు భేష్‌.. సైబర్‌ నేరాలను ఎదుర్కొనేందుకు డీజీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ’సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో’ను ఏర్పాటు చేశాం.ఈ విభాగం అత్యంత సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తూ దేశంలో ది బెస్ట్‌ గా నిలిచింది.సైబర్‌ నేరగాళ్ళను అరికట్టడానికి అంతర్‌ రాష్ట్ర ఆపరేషన్లు సైతం నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు యావత్‌ దేశం సెల్యూట్‌ చేస్తోందని అన్నారు. తీవ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు గతంలో రాష్ట్రంలో విస్తృతంగా జరిగేవి.కానీ నేడు పోలీస్‌ శాఖ చర్యల వల్ల శాంతి నెలకొంది.మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులను జనజీవన స్రవంతిలో కలవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.ఇటీవల కొందరు మావోయిస్టు కీలక నాయకులు లొంగిపోయిన విషయం విూ అందరికీ తెలుసన్నారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయి దేశాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. పోలీసు శాఖలోని పలు కీలక విభాగాల్లో అర్హత కలిగిన మహిళా ఐపీఎస్‌ అధికారులకు పోస్టింగులు ఇచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ పోలీసు అకాడవిూ, జైళ్ల శాఖ, ఎస్‌ఐబీ, ఏసీబీ, సీఐడీ, విజిలెన్స్‌, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌, సీసీఎస్‌, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోలకు మహిళా ఐపీఎస్‌ల సారధ్యం వహించడం మా ప్రభుత్వానికి గర్వకారణం. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ ఈ కీలక పోలీసు కమిషనరేట్లలో జోన్‌ డీసీపీలుగా ఏడుగురు మహిళా అధికారులే. రెండేసి కీలక విభాగాలను సైతం సమర్థవంతంగా నడిపిస్తున్న మహిళా ఐపీఎస్‌ అధికారులను చూసి తెలంగాణ గర్విస్తోందన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన లేదా గాయపడి, అంగవైకల్యం పొందిన పోలీసు అధికారులు, సిబ్బందికి, దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్టపరిహారం అందించాం. విధినిర్వహణలో వీరమరణం పొందిన పోలీసు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్‌ స్కూళ్ళల్లో ఉచిత విద్య, వైద్యం, బస్‌ పాస్‌ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం.మెడికల్‌ సీట్ల లోను పోలీస్‌ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్‌ గ్రేషియాను కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్‌ఐల వరకు కోటి రూపాయలను, ఎస్సై సీఐలకు కోటి 25 లక్షల రూపాయలను, డీఎస్పీ, అడిషనల్‌ ఎస్పీలకు కోటి 50 లక్షల రూపాయలను, ఎస్పీలకు ఇతర ఐపీఎస్‌ అధికారులకు రెండు కోట్ల రూపాయలకు పెంచుతూ మా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.మన ప్రాణానికి వారి ప్రాణాలను అడ్డుపెట్టే పోలీసుల రుణం ఏమిచ్చినా తీరదు.సమాజ శ్రేయస్సే ఊపిరిగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఒలంపియన్‌, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, వరల్డ్‌ కప్‌ విన్నర్‌ క్రికెటర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ కు డీఎస్పీగా ఉద్యోగాలు ఇచ్చి తెలంగాణ పోలీసుల ప్రతిష్టతను పెంచాం.ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి అత్యంత ప్రాధాన్యతో కూడిన అంశం.ఈ విషయంలో మా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పని చేస్తూ పోలీసు శాఖ మా అందరిలో స్ఫూర్తి నింపుతోంది.సోషల్‌ విూడియా ప్రభావం బాగా పెరిగిన ఈ కాలంలో పోలీసుల ప్రతి అడుగు, మాట జాగ్రత్తగా ఉండాలి.’ఫ్రెండ్లీ పోలీసింగ్‌’ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే,చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్య పాలనలో ప్రజల హక్కులను కాపాడుతూ, వారి సమస్యలను తెలియజేసేందుకు చేపట్టే నిరసన కార్యక్రమాలకు పోలీసులు అనుమతి ఇస్తూనే, ఈ సందర్భంలో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎంతో సున్నితంగా వ్యవహరించాలి. సమాజంలో శాంతి భద్రతలను సుస్థిరంగా ఉంచేందుకు పాటుపడే క్రమంలో విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.