మా ఆయన శ్రీరామచంద్రుడు

పెళ్లి కాలేదని ఎలా అంటారు

ఆనందీబెన్‌ వ్యాఖ్యలకు జశోదాబెన్‌ తీవ్రంగా స్పందన

అహ్మదాబాద్‌,జూన్‌21(జ‌నం సాక్షి): మా ఆయన బంగారం అంటూ..శ్రీరామచంద్రుడితో సమానమంటూ ప్రధాని మోదీ సతీమణి జశోదాబెన్‌ కితాబునిచ్చారు. పెళ్లయ్యాక ఎవరికి వారే ఉంటున్నా యోశోదాబెన్‌ మోడీని ఎప్పుడూ విమర్శించలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వివాహం కాలేదంటూ ఇటీవల మధ్యప్రదేశ్‌ గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇది కాస్తా సోషల్‌విూడియా, స్థానిక విూడియాలో వైరల్‌గా మారడంతో ఆనందిబెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ప్రధాని మోడీపై అలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆమె అన్నారు. భార్యగా తానుండగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అన్నరీతిలో ఆమె స్పందించారు. ఆనందిబెన్‌ వ్యాఖ్యల గురించి తెలిసి ఆశ్చర్యపోయాను. ప్రధాని మోదీకి పెళ్లి కాలేదని ఎలా అంటారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వేసిన నామినేషన్‌లో తనకు వివాహం అయ్యిందని, భార్య పేరు జశోదాబెన్‌ అని ఆయనే స్వయంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ఆనందిబెన్‌ అలాంటి వ్యాఖ్యలు ఎలా చేశారు. ఉన్నత చదువులు చదివిన ఓ మహిళ(ఆనందిబెన్‌).. ఓ సామాన్య టీచర్‌(జశోదాబెన్‌) గురించి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఇదే కాదు.. ఆమె గతంలో చేసిన కొన్ని పనులు ప్రధాని పేరును చెడగొట్టేలా ఉన్నాయి. నా వరకు ఆయన మోదీ ఎంతో గౌరవనీయమైన వ్యక్తి. రాముడి లాంటి వారు అని జశోదాబెన్‌ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. గుజరాత్‌ మాజీ సీఎం అయిన ఆనందిబెన్‌ పటేల్‌ చేసిన వ్యాఖ్యలు ఈ నెల 19న స్థానిక పత్రికల్లో వచ్చాయి. ఆ తర్వాత సోషల్‌విూడియాలోనూ వైరల్‌గా మారాయి. దీంతో ఆనందిబెన్‌ వ్యాఖ్యలపై తమ సోదరి స్పందిచాల్సి వచ్చిందని జశోదాబెన్‌ సోదరుడు అశోక్‌ తెలిపారు.