మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతి

బ్రిడ్జి వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రులు
త్వరలోనే కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడతామన్న తలసాని

హైదరాబాద్‌,జూలై 29(జనంసాక్షి ): గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలకు మూసీ నదికి భారీ వరద చేరుతోంది. దీంతో మూసారాంబాగ్‌ బ్రిడ్జి చాలా వరకు దెబ్బతిన్నది. మూసీ నది ఉధృతితో ముసారాంబాగ్‌ బ్రిడ్జ్‌ పై కొన్ని రోజుల నుండి ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. బ్రిడ్జ్‌ పై రాళ్లు, చెత్త, బురద పేరుకు పోయింది. బ్రిడ్జ్‌ పై ఉన్న రాళ్లను అధికారులు తొలగించారు.ట్రాఫిక్‌ మళ్లింపుతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై రాకపోకలను జీహెచ్‌ఎంసీ అధికారులు
అనుమతించారు. ముసారాంబాగ్‌ వద్ద బ్రిడ్జిని మంత్రులు మహమ్మద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, వాటర్‌ బోర్డ్‌ ఎండి దాన కిషోర్‌ ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ విూడియాతో మాట్లాడారు. రూ.52 కోట్లతో ముసారాంబాగ్‌ అంబర్‌ పేట, ఆలీ కేఫ్‌ మార్గంలో మూసిపై కొత్త బ్రిడ్జి నిర్మాణం చేస్తామన్నారు. పది రోజులలో ఈ నూతన బ్రిడ్జి పనులు ప్రారంభం అవుతాయని మంత్రి తలసాని అన్నారు. 9 నెలల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోతాయన్నారు. హైదరాబాద్‌ నాలా అభివృద్ధి పనులు వచ్చే వర్షాకాలానికి పూర్తి అవుతాయని తెలిపారు.మూసి పరిసరాల్లో రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం పనులు చేపడుతామని మంత్రి చెప్పారు.