మెజార్టీ మాకే ఉంది: ఆజాద్
బెంగళూరు,మే15(జనం సాక్షి ): కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు హంగ్ దిశగా పయనిస్తుండటంతో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు జేడీఎస్కు మద్దతు ప్రకటించారు. ఆ పార్టీ నుంచి ఎవరు సీఎం అయినా తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. జెడిఎస్తో కలపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతగా మెజార్టీ ఉందని ఆజాద్ అన్నారు. ఇరు పార్టీల నేతలు గవర్నర్ను కలుస్తారని ఆయన స్పష్టంచేశారు. జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో ఫోన్లో చర్చలు జరిపామని, వారిద్దరూ తమ ప్రతిపాదనను అంగీకరించారని ఆజాద్ అన్నారు. ఇదిలావుంటే ప్రజల తీర్పే తమకు శిరోధార్యమని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. జేడీఎస్కు కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.