మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం


ఇరుకున్న పడ్డ సిఎం సిద్దరామయ్య
ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదం
బెంగళూరు,ఆగస్ట్‌17(జనం సాక్షి): మైసూర్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే భూ కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అంతేకాదు ఈ కేసులో
గవర్నర్‌ ఇటీవల ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు షోకాజ్‌ నోటీసు పంపించారు. సిద్ధరామయ్యపై ఆర్‌టీఐ కార్యకర్త టీజే అబ్రహం కేసు దాఖలు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద సీఎంపై విచారణకు అనుమతి ఎందుకు ఇవ్వకూడదని ప్రశ్నించారు. ఆ క్రమంలో సీఎంను ప్రాసిక్యూట్‌ చేసేందుకు గవర్నర్‌ అనుమతి ఇవ్వాలని కోరారు. ఆయన ఆమోదం లేకుండా సీఎంపై కేసు పెట్టలేమని అందుకే అవినీతి నిరోధక చట్టం కింద సీఎంపై కేసు నమోదు చేయాలని అబ్రహం గవర్నర్‌ను డిమాండ్‌ చేశారు. సిద్ధరామయ్య, ఆయన భార్య, కుమారుడు, ముడా కమిషనర్‌పై కూడా కేసు నమోదు చేయాలని అబ్రహం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముడా కుంభకోణంలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కుంభకోణంలో సిద్ధరామయ్య దంపతులు లబ్ది పొందారని తెలుస్తోంది. 2021లో ముడా అభివృద్ధి కోసం మైసూరులోని కేసరే గ్రామంలో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి నుంచి 3 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. ప్రతిఫలంగా ఆమెకు దక్షిణ మైసూర్‌లోని విజయనగర్‌లో భూమిని కేటాయించారు. విజయనగరంలో భూమి ధర కేసరెలో భూమి కంటే చాలా ఎక్కువ కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో ముడా ద్వారా ఈ భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి.అంతేకాదు 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తన భార్య యాజమాన్యాన్ని వెల్లడిరచడంలో సిద్ధరామయ్య విఫలమయ్యారని ఆర్టీఐ కార్యకర్త అబ్రహం తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవానికి ఓఙఆం కర్ణాటక రాష్ట్ర స్థాయి అభివృద్ధి సంస్థ. పట్టణాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ ఏజెన్సీ పని. దీంతో పాటు ప్రజలకు అందుబాటు ధరల్లో ఇళ్లను అందించాలి. కానీ సీఎం భార్యకు ఎక్కువ ధర ఉన్న భూమిని అప్పగించడంపై బీజేపీతోపాటు పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.