‘మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదు’

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మానసిక పరిస్థితి సరిగాలేదని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ విమర్శించారు. ఏళ్ల తరబడి దేశం సాధించిన విజయాలను మోదీ గుర్తించలేకపోతున్నారని అన్నారు. దేశం మొత్తం కుంభకోణాలకు పాల్పడినట్టుగా మోదీ వ్యవహరించడం సరికాదని ఆనంద్ శర్మ వ్యాఖ్యానించారు.
మోదీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని, ఏడాది పాలనంతా ప్రచార ఆర్భాటమేనని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ విధానాలను బీజేపీ ప్రభుత్వం పేరు, ప్యాకేజీ మార్చి ప్రచారం చేసుకుంటోందని ఆనంద్ శర్మ ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రచార నినాదాలుగానే మిగిలిపోయానని చెప్పారు. సంక్షేమం, విద్య వంటి పథకాలకు బడ్జెట్లో కోత విధించారని అన్నారు. అంతర్జాతీయంగా చమరు ధరలు తగ్గినా.. భారత్లో ఆ మేరకు ధరలు తగ్గలేదని చెప్పారు. యూపీఏ విజయాలను కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకోకపోవడం వల్లే ఓడిపోయామని ఆనంద్ శర్మ చెప్పారు.