మోసపూరిత వాగ్దానాలతో..
కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నాడు
– కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్
హైదరాబాద్ , సెప్టెంబర్4(జనం సాక్షి) : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్ సెలూన్లకు డొమెస్టిక్ విద్యుత్ టారిఫ్ ఇచ్చానని కేసీఆర్ అబద్దం చెప్పారంటూ నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు. గాంధీభవన్ ముందున్న గాంధీ విగ్రహం ముందు షేవింగ్ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. నాయి బ్రాహ్మణుల నిరసనకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 250 కోట్లతో నాయి బ్రాహ్మణుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. నిధి ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాగ్దానం చేస్తే రాజముద్రగా ఉండాలి కానీ.. కేసీఆర్ వాగ్దానాలు చెట్ల విూద విస్తరాకుల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడ్రస్ సెలూన్లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు కేసీఆర్ మోసాలు తెస్తున్నాయని, ఎన్నికల సమయం వరకు ఆగితే ఓటమి తప్పనే భావనతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ మోసాలను ప్రజలు ఇప్పటికే గుర్తించారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనేని అన్నారు.
—————————ర


