యువతికి డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేసిన డిఎస్పీ
ఆరోపణతో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
జలంధర్,జూన్29(జనం సాక్షి): పంజాబ్లో మరో దారుణం వెలుగు చూసింది. పోలీసుశాఖకు చెందిన డీఎస్పీ తనకు డ్రగ్స్ ఇచ్చి గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన వ్యవహారం ఆలస్యంగా ఫిర్యాదుతో వెలుగు చూసింది. తనపై డిఎస్పీ అత్యాచారానికి ఒడిగట్టాడని లూథియానాకు చెందిన 26 ఏళ్ల యువతి విలేకరుల సమావేశంలో ఆరోపించింది. 2013లో ఫిరోజ్ పూర్ డీఎస్పీ దల్జీత్ సింగ్ ఇంటికి వెళ్లిన తనకు హెరాయిన్ డ్రగ్స్ ఇచ్చి పై గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడని లూథియానా మహిళ ఆరోపించింది. తనకు డ్రగ్స్ ఎలా తీసుకోవాలో నేర్పిన డీఎస్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ కూడా తనకు ఇచ్చాడని యువతి పేర్కొంది. డీఎస్పీ తనకు డ్రగ్స్ అలవాటు చేశాడని, తాను చికిత్స తీసుకున్న తర్వాత వాటికి దూరంగా ఉంటున్నానని చెప్పింది. యువతి చేసిన ఆరోపణల నేపథ్యంలో నిందితుడైన డీఎస్పీ దల్జీత్ సింగ్ను సస్పెండ్ చేసి దర్యాప్తు చేయాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ డీజీపీని ఆదేశించారు. దీంతో పంజాబ్ డీజీపీ సురేష్ అరోరా డీఎస్పీ కామకేళిపై విచారణకు ఆదేశించారు.