యూపిలో బిజెపి నేత దారుణహత్య
దుండగుల కోసం పోలీసుల గాలింపు
లక్నో,మే9(జనం సాక్షి): ఉత్తరప్రదేశ్లోని ఫుల్పుర్లో బీజేపీ నేత పవన్ కేశరిని గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. కాల్పులు జరిపిన వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్లర్లు ప్రకటించారు. మృతుడు ఫుల్పుర్ పంచాయతీ సభ్యునిగా కూడా ఉన్నారు. పవన్ కేశరి కాల్పులకు గురైన వెంటనే పంచాయతీ సభ్యులు అతనిని సవిూపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పవన్ కేశరి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనకు పాల్పడినట్టు భావిస్తున్న ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం రాత్రి పవన్ కేశరి(35) తన స్నేహితుడు ఆరిఫ్ను షేఖ్పుర్లోని అతని ఇంటికి దిగబెట్టేందుకు ద్విచక్రవాహనంపై బయలు దేరారు. ఈ నేపధ్యంలోనే పవన్ కేశరిపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన జరిగిన తరువాత పవన్ కేశరి స్నేహితుడు ఆరిఫ్ కూడా మాయమయ్యాడు. అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. కాగా హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సివుంది.