రాజస్థాన్లో దారుణ ఘటన
బాలికపై అత్యాచారం… గొంతు నులిమి హత్య
జైపూర్,డిసెంబర్2(జనంసాక్షి): వరుసహత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిశ ఘటన మరువకముందే రాజస్థాన్ రాష్ట్రం టోంక్ జిల్లాలో బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఒకటో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అలిగఢ్ సవిూపంలో గ్రామంలో బాలిక మృతదేహం కనిపించడంతో స్థానిక పోలీసులకు గ్రామస్థులు సమాచారం ఇచ్చారు. స్థానిక ఎస్పి విపిన్ శర్మ అక్కడి చేరుకొని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలికపై అత్యాచారం చేసిన తరువాత స్కూల్ బెల్టుతో బాలికను ఉరేశారని శర్మ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. నిందితులను అతి త్వరలో పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో వెటర్నరీ వైద్యురాలిపై నలుగురు కామాంధులు అత్యాచారం చేసి సజీవదహనం చేసిన విషయం తెలిసిందే. ఝార్ఖండ్ రాష్ట్రం రాంఛీ ప్రాంతంలో లా చదివే విద్యార్థినిపై 12 మంది సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలతో దేశంలో తీవ్ర ఆందోళన నెలకొన్న తరుణంలో బాలికపై ఇలాంటి దారుణం జరగడంపై స్థానికంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి.