రికవరీలో భారత్‌ టాప్‌

దిల్లీ,అక్టోబరు 3(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల రికవరీల్లో భారతదేశం అగ్రస్థానంలో కొనసాగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు(సీఎఫ్‌ఆర్‌) కూడా తక్కువే అని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం విూడియాకు సమాచారం వెల్లడించింది. ‘అంతర్జాతీయంగా సీఎఫ్‌ఆర్‌ 2.97శాతంగా ఉండగా.. భారత్‌లో 1.56శాతంగా నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్‌ జనాభాకు 130 కరోనా మరణాలు సంభవిస్తుంటే.. భారత్‌లో 73 మంది మరణిస్తున్నారు. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా మొత్తం 54లక్షల మంది(83.84శాతం) వైరస్‌ బారి నుంచి బయటపడ్డారు. అంతర్జాతీయంగా రికవరీల్లో భారత్‌ వాటా 21శాతం ఉండగా.. కేసుల విషయంలో 18.6శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 9లక్షల యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. పది లక్షల యాక్టివ్‌ కేసుల సంఖ్యను మించకుండా భారత్‌ స్థిరంగా కొనసాగడం ఇది 12వ రోజు. దేశంలో దాదాపు 77శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. మహారాష్ట్రలోనే అత్యధికంగా రెండున్నర లక్షలకు పైగా కేసులున్నాయి’ అని కేంద్రం తెలిపింది.కాగా గడిచిన 24 గంటల్లో 79వేల కేసులు నమోదు కాగా.. 1,069 మరణాలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య లక్ష దాటినట్లు కేంద్రం వెల్లడించింది.