రైల్వేల సామర్థ్యం ఇంకా పెరగాలి
బుల్లెట్ ట్రైన్ పేదలకు ఉపయుక్తం కాదు
మెట్రోమ్యాన్ ఈ.శ్రీధరన్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ,జూలై2(జనం సాక్షి ): భారతీయ రైల్వేలు మరింత పక్కాగా నడవాల్సి ఉందని, సామర్థ్యం పెంచుకోవలసి ఉందని మెట్రో పితామహుడు ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) విశ్రాంత అధికారి ఈ.శ్రీధరన్ అన్నారు. బెల్లెట్ రైలుకు ముందు ఉన్న రైళ్లు బాగుపడాలన్సి ఉందన్నారు. ఇప్పటికీ సమయపాలన లోపించిందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్ (ఐఈఎస్) విశ్రాంత అధికారి ఈ.శ్రీధరన్ విమర్శించారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మోదీ ఈ బుల్లెట్ రైలును ప్రారంభించి ఎంతో మందికి ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మెట్రో రైలు వ్యవస్థకు సంబంధించి ప్రమాణాలను నిర్దేశిరచేందుకు ఏర్పాటు చేసిన కమిటీకి హెడ్గా శ్రీధరన్ను నియమించిన వారం రోజుల్లోనే ఆయన బుల్లెట్ రైలుపై ప్రతికూలంగా మాట్లాడడం గమనార్హం. మెట్రో మ్యాన్గా పేరున్న శ్రీధరన్ దిల్లీ మెట్రోకు 1995 నుంచి 2012 వరకు డైరెక్టర్గా పనిచేశారు. బుల్లెట్ రైళ్లు ఉన్నత వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతుంటాయి. ఇది చాలా ఖరీదైనది. సామాన్య ప్రజలు ఈ భారం భరించలేరు. భారత్కు ప్రస్తుతం ఆధునికమైన, పరిశుభ్రమైన, వేగవంతమైన, సురక్షితమైన రైల్వే వ్యవస్థ కావాలి’ అని శ్రీధరన్ ఓ విూడియాకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మోదీ హయాంలో రైల్వేలు అభివృద్ధి చెందాయి. ఇంజిన్లు, రైళ్లు, స్టేషన్ల దగ్గరి నుంచి ఆహారం, టికెట్ బుకింగ్స్ వరకు అన్నింట్లోనూ మార్పులు వస్తున్నాయి. అయితే భారత రైల్వేలు చాలా వేగంగా అభివృద్ధి చెందాయంటే నేను అంగీకరించను. బయో టాయిలెట్స్ కాకుండా మిగతా విషయాల్లో సాంకేతిక అప్గ్రెడేషన్ లేదు. వేగం పెరగలేదు. చాలా వరకు ప్రముఖ రైళ్లలో సగటు వేగం తగ్గింది. వేళకురావు. తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రమాదాల సంఖ్య తగ్గట్లేదు. చాలా మంది ట్రాక్లపై చనిపోతున్నారు. లెవల్ క్రాసింగ్ల వద్ద, సబర్బన్ స్టేషన్ల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. దాదాపు ఏడాదికి 20వేల మంది ట్రాక్స్పై ప్రాణాలు కోల్పోతున్నారు. భారత రైల్వే అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 20ఏళ్లు వెనక ఉన్నట్లు అనిపిస్తుంది’ అని శ్రీధరన్ పేర్కొన్నారు. ఇప్పటికే బుల్లెట్ రైలు ప్రాజెక్టు బ్జడెట్, రైలు వినియోగం విషయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రాజెక్టు విషయంలో బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తంచేసిన తొలి నిపుణుడు శ్రీధరన్. అయితే ఆయన మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో మాత్రం సానుకూలంగా స్పందించారు. మెట్రో సర్వీసుల ప్రామాణీకరణ, దేశీయీకరణ కోసం తాను చాలా కాలంగా కృషి చేస్తున్నానని, దీని వల్ల ధర తగ్గుందని అన్నారు. ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. మెట్రో కోచ్లు, ఇతర భాగాలు దేశీయంగా తయారు చేసుకోవచ్చన్నారు. మెట్రోను మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్గా మార్చాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మోదీ ప్రభుత్వం జపాన్ సహకారంతో ముంబయి నుంచి అహ్మదాబాద్కు 17 బిలియన్ డాలర్ల విలువ చేసే బు/-లలెట్ రైలు ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. 2022 ఆగస్టు నాటికి ప్రాజెక్టు పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
—–