వాట్సాప్‌లో అదిరిపోయే మరో కొత్త ఫీచర్‌ పరీక్షిస్తోన్న వాట్సాప్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌ త్వరలో మరో సదుపాయాన్ని వినియోగదారులకు అందించబోతోంది. ఎప్పటికప్పుడు యాప్‌ను అప్‌డేట్‌ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్‌.. బీటా వెర్షన్‌ తాజాగా ఓ కొత్త సదుపాయాన్ని పరీక్షిస్తోంది. దీని ప్రకారం ఎవరైనా అవతలి వారికి మెసేజ్‌ పంపిన అనంతరం అది 5 నిమిషాల తర్వాత మాయమైపోతుంది. అయితే అది చేరిన ఐదు నిమిషాలకా? లేదా చదవిన ఐదు నిమిషాలకా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వాట్సాప్‌ వెబ్‌ వెర్షన్‌ 0.2.4077 ద్వారా మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. సెట్టింగ్స్‌లో దీన్ని ఆన్‌ చేయడం ద్వారా ఈ సౌలభ్యాన్ని పొందొచ్చు.పంపే సందేశంలోని ఫాంట్‌లను ఫార్మేట్‌ చేసుకునేలా కూడా కొత్త సౌలభ్యాన్ని వాట్సాప్‌ తన బీటా వెర్షన్‌ 2.17.148లో అందిస్తోంది. దీన్ని ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఎదైనా టెక్ట్స్‌ను టైప్‌ చేశాక దాన్ని సెలక్ట్‌ చేసుకుని బోల్డ్‌, ఇటాలిక్‌ ఫార్మాట్‌లోకి మార్చడం వీలవుతుంది. మనం పంపే సందేశంలో అత్యవసర విషయాన్ని ఈ సదుపాయం ద్వారా మరింత సమర్థంగా పంపొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్‌ బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో వినియోగదారులకు ఎప్పటినుంచి అందుబాటులోకి వస్తాయో సమాచారం లేదు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ నోగట్‌ వెర్షన్‌ వాడుతున్నవారు తమ ఫోన్‌లో గూగుల్‌ ట్రాన్సలేట్‌ ఉండి ఉంటే ఆయా మెసేజ్‌లను అక్కడే ట్రాన్సలేట్‌ చేసుకునేలా ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది.