విజయవంతంగా సామూహిక జాతీయ గీతాలాపన.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు16(జనంసాక్షి):
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం అయింది.ఈ గీతాలాపన లో ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాల ఉద్యోగస్తులు, సిబ్బంది, వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు,జర్నలిస్టు లు పాల్గొన్నారు.
కలెక్టర్ పి ఉదయ్ కుమార్:
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు మేయిన్ రోడ్డు పై నిర్వహించిన
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు.మంగళవారం ఉదయం 11.30 గంటలకు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ లు,అన్ని మండలాలు,ప్రతి గ్రామ పంచాయతీలో ప్రభుత్వ ప్రయివేట్ కార్యాలయాలు,వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు ప్రతి చోట ఏక కాలంలో జాతీయ గీతాలాపన నిర్వహించడం జరిగిందన్నారు.ఎప్పుడు హడావిడి,సౌండ్ పొల్యూషన్ తో ఉండే నాగర్ కర్నూల్ పట్టణంలో ఉదయం 11.25 కు రోడ్డు మొత్తం బ్లాక్ చేసి 11.30 నిమిషాలకు ఏకకాలంలో పట్టణంలోని ప్రజలు, విద్యార్థులు, పోలీస్ లు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కుల మత వర్గ లింగ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ గీతాలాపన ఆలపించడం గొప్ప విజయమని కొనియాడారు.వజ్రోత్సవాల్లో భాగంగా రాబోయే 5 రోజులు జరిగే వివిధ కార్యక్రమాలకు సైతం ప్రజల భాగస్వామ్యం అవసరమని ముఖ్యాముగా రేపు జరిగే రక్తదాన శిబిరంలో జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య వంతులైన యువతి యువకులు రక్తదానం చేసి ఆరోగ్య పరంగా ఆపదలో ఉన్న సాటి వ్యక్తికి జీవనదానం చేయాలని ప్రజలను కోరారు.

శాసనసభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం కొరకు తమ కుటుంబాలను, తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడి అమరులైన ఎందరో మహాను భావులను స్మరించుకోవడానికి, స్వాతంత్య్రం వచ్చాక ఈ 75 సంవత్సరాల్లో భారత దేశం సాధించిన అభివృద్ధి గురించి స్మరించుకోడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఆగస్టు 8 నుండి ఇప్పటి వరకు జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములై విజయవంతం చేసినందుకు ప్రజలకు అభినందనలు తెలిపారు.ఇదే స్ఫూర్తిని కొనసాగించి రాబోయే 5 రోజుల రోజువారీ వజ్రోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ మను చౌదరి,అదనపు కలెక్టర్ రెవెన్యూ మోతిలాల్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు ప్రజలు పాల్గొన్నారు.