విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సుల నిలిపివేత

వాయుగుండం తీరం దాటినప్పటికీ వర్షాలు వీడలేదు. తెలంగాణను ఇవాళ కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఏపీలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ, గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పరవళ్లు తొక్కుతున్నాయి.

ఎన్టీఆర్ జిల్లా ఐతవరం వద్ద రోడ్డుపైకి వరద నీరు రావడంతో ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాంతో, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులను అధికారులు నిలిపివేశారు. వరంగల్ వద్ద రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో ఇప్పటికే రైళ్లు నిలిచిపోయాయి. అటు రైళ్లలో వెళ్లే మార్గం లేక, ఇటు బస్సులు కూడా నడవక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు కూడా నిలిచిపోగా… ఆర్టీసీ బస్సులు కూడా నిలిచిపోవడంతో ప్రయాణికులు విజయవాడ బస్టాండ్ లో ఇబ్బందులు పడుతున్నారు.