విజయ్‌ మల్యా పాస్‌పోర్టు సస్పెన్షన్‌

2

– ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): బ్యాంకులకు రుణాలను ఎగవేసి తప్పించుకుని పోయిన  విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సిఫార్సు మేరకు మాల్యా పాస్‌పోర్టును రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. బ్యాంకులకు రూ.9వేల కోట్ల రుణాల ఎగవేతకు సంబంధించి మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు పంపినా మాల్యా హాజరుకాలేదు. దీంతో మాల్యా పాస్‌పోర్టును రద్దు చేయాలని విదేశాంగశాఖకు ఈడీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాను విచారణకు హాజరు కావాలని ఈడీ మూడుసార్లు సమన్లు పంపింది. తాజాగా ఏప్రిల్‌ 9న మాల్యా విచారణకు హాజరుకాకుండా తనకు మే చివరి వరకు గడువు కావాలని కోరారు. మాల్యాను దేశం విడిచి పోకుండా కట్టడి చేయాలని గతంలో బ్యాంకులు చేసిన విజ్ఞప్తితో… పాస్‌పోర్టుతో కోర్టులో హాజరుకావాలని మాల్యాను సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయన అప్పటికే దేశం విడిచి లండన్‌ వెళ్లిపోయారు. దీంతో చేసేది లేక ఇప్పుడు పాస్ట్‌పోర్టును రద్దు చేశారు.