వైఎస్సార్సీపీ హయాంలో మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు

2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు

అమరావతి: ఏపీలో 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ రాజశేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యలతో సిట్‌ను నియమించింది. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్‌కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్‌ శాఖకు ఆదేశాలు జారీ అయ్యాయి. దర్యాప్తు బృందం.. సీఐడీ చీఫ్‌ ద్వారా ప్రతి 15రోజులకోసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

సిట్‌లో సభ్యులుగా ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుబ్బరాయుడు, అదనపు ఎస్పీ కొల్లి శ్రీనివాస్‌, సీఐడీ ఏఎస్పీ శ్రీహరిబాబు, డోన్‌ డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ శివాజీని నియమించారు. సీఐడీ డీఐజీ ఆధ్వర్యంలోనే సిట్‌ పనిచేస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్‌ బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు. 2019 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి రూ.90వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం. నగదు లావాదేవీలతో పాటు హోలో గ్రామ్‌ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.