వైట్‌హౌస్‌లో పేలుళ్లు!

ఒబామాకు గాయాలు..కలకలం రేపిన ‘అసోసియేటెడ్‌ ప్రెస్‌ ట్వీట్‌’ సిరియన్‌ ఎలక్ట్రానిక్‌ ఆర్మీ హ్యకింగ్‌ ఫలితం

వాషింగ్టన్‌,ఏప్రిల్‌ 24 :”వైబ్‌హౌస్‌లో రెండు బాంబు పేలుళ్లు జరిగాయి.అధ్యక్షుడు ఒబామా గాయాలపాలయ్యారు.” అంటూ అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) ట్విటర్‌ ద్వారా బ్రేకింగ్‌ న్యూస్‌గా తెలిపింది.అగ్ర దేశ అధ్యక్షుడి భవనంలో పేలుడు ఏమిటి? ఒబామా గాయపడడమేంటి అని అనుకుంటున్నారా?మీ అనుమానం నిజమే.ట్విటర్‌లో ఈ విషయంపై ఏపీ ట్విట్‌ చేసింది కూడా నిజమే కాని..దానికి పాల్పడింది మాత్రం సిరియన్‌ ఎలక్ట్రానిక్‌ ఆర్మీ పేరిట పనిచేసే హ్యకర్లని తర్వాత తేలింది. కలకలం రేపిన ఈ ట్వీట్‌తో ఏపీని నిత్యం అనుసరించే 20 లక్షల మంది పాఠకులు ఆందోళనకు గురయ్యారు.విషయం తెలుసుకున్న వెంటనే ప్రెస్‌ నిర్వాహకులు హ్యకింగ్‌ విషయాన్ని వెల్లడించారు.అలాగే ఒబామా భద్రంగా ఉన్నారంటు వైట్‌హౌస్‌ ప్రెస్‌ కార్యదర్శి జే కార్నే కూడా ప్రకటన విడుదల చేయడంతో పరిస్థితి చల్లబడింది.మరోవైపు ఈ ట్వీట్‌ ప్రభావంతో అమెరికా స్టాక్‌ మార్కెట్‌ కూడా 100 పాయింట్లు మేర పతనమైంది.అయితే,హ్యకింగ్‌ విషయం తెలియడంతో పాటు,వైట్‌హౌస్‌ ప్రకటన అనంతరం మళ్లీ కోలుకుంది.