సిఎం జగన్‌ రాజీనామా చేయాల్సి రావచ్చు

కోర్టు ధిక్కరణ కింద నోటీసులు రావొచ్చన్న ఎంపీ రఘురామకృష్ణరాజు

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): మాజీ సీఎంలు నీలం సంజీవరెడ్డి, ఎన్‌.జనార్థన్‌రెడ్డిలా జగన్‌ కూడా సీఎం పదవికి రాజీనామా చేయాల్సి రావొచ్చని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. రేపోమాపో కోర్టు ధిక్కరణ నోటీసులు తీసుకోవడానికి జగన్‌ సిద్ధంగా ఉండాలన్నారు. కోర్టు నోటీసులపై తమ పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోందని, తప్పు ఒప్పుకుని కోర్టులను క్షమాపణ కోరితే జగన్‌కు శిక్ష తప్పొచ్చన్నారు. ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినా.. జగన్‌కు దుబ్బాక ఫలితం తప్పదని చెప్పారు. అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సింహాద్రి, మాన్సాస్‌ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఎవరైనా కింది కోర్టు ఇచ్చిన తీర్పులపై పైకోర్టుకు వెళ్లడం సహజం. కానీ, వైసీపీ పెద్దలు జడ్జిల చిత్తశుద్ధి విూదే అనుమానాలున్నాయంటూ పెద్ద వివాదానికి తెరలేపారు. నిర్దిష్టంగా కొందరు న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు అక్టోబర్‌ 6వ తేదీన లేఖ రాశారు. దానిని… 8వ తేదీన అందించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఆకస్మికంగా విూడియా ముందుకు వచ్చేశారు. ‘హైడ్రామా’ సృష్టించారు. సీజేకు ఇచ్చిన ఫిర్యాదుతోపాటు పలురకాల పత్రాలు బహిర్గతం చేశారు. జడ్జిల పేర్లు ప్రస్తావిస్తూ ఆరోపణలు చేశారు. నిజంగా న్యాయ వ్యవస్థపైన, సుప్రీంకోర్టు పైన గౌరవం ఉంటే… తమ ఫిర్యాదుపై చీఫ్‌ జస్టిస్‌ స్పందన కోసం వేచి చూసేవారని, ఫిర్యాదు పత్రాలు బహిర్గతం చేసే వారు కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. విూడియా ముందు రచ్చ చేయడంతో వైసీపీ పెద్దల దురుద్దేశాలు బయటపడిపోయాయని అభిప్రాయపడుతున్నారు.