సిఓఈ బోధనా సిబ్బందిని అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే.

ప్రిన్సిపాల్ ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, సెప్టెంబర్18,(జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఉపాధ్యాయులను, అధ్యాపకులను, సిబ్బందిని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రిన్సిపల్ ఐనాల సైదులు ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలతో ఇతర విద్యాసంస్థలకు ఆదర్శంగా నిలవడం అభినందనీయం అన్నారు. విద్యార్థుల విజయాలను తమవిగా భావిస్తూ ముందుకు పోతున్న బెల్లంపల్లి సిఓఈ బోధన సిబ్బంది అంకితభావం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఇట్లాంటి ఉపాధ్యాయ బృందం వారిని నడిపించగల పట్టుదల ఉన్న ప్రిన్సిపల్ ఉంటే ఏ విద్యాలయమైనా గొప్ప గొప్ప విజయాలను సాధిస్తుందన్నారు.
ఉత్తమ ప్రణాళిక, తగిన కార్యచరణ మంచి ఫలితాలను ఇస్తాయి అనడానికి సిఓఈ విద్యార్థులు సాధిస్తున్న విజయాలే కారణమన్నారు. ఉపాధ్యాయులు అధ్యాపకులు తమ సొంత సమయాన్ని విద్యార్థుల భవిష్యత్తుకు వెచ్చించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నిస్వార్ధ పూరితమైన ఉపాధ్యాయుల త్యాగాలే విద్యార్థులకు గొప్ప భవిష్యత్తును ఇస్తుందన్నారు. అన్ని వృత్తుల వారిని తయారు చేసే ఉపాధ్యాయ వృత్తి అంటే తనకు ఎంతో అభిమానం అనీ అందుకే ఐఐటి, నీట్ , ఎన్ఐటి వంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు సీట్లు సాధించేలా తీర్చిదిద్దుతున్న సిఓఈ బోధనా సిబ్బందిని ప్రత్యేకంగా సన్మానించాలని అనుకున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో ప్రిన్సిపాల్ అయినాల సైదులు, అధ్యాపకులు మిట్టా రమేష్, చందా లక్ష్మీనారాయణ, అనుముల అనిరుద్, ఉపాధ్యాయులు వరమని ప్రమోద్ కుమార్, షిండే దత్త ప్రసాద్, ఎం రాజేష్, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

తాజావార్తలు