సిలిండర్ల ధర గురించి విపక్షాలకు మాట్లాడే అర్హత లేదు

` రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌, ఇంటిపన్నులు, రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచి ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న కెసిఆర్‌ సర్కార్‌కు చరమగీతం పాడుతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. భూముల రిజస్టేష్రన్‌ ఛార్జీలు పెంచడంతో సామాన్యలుకు భారంగా మారిందన్నారు. ఊరికోటి, గల్లీకోటి అన్నట్లుగా బెల్టు షాపులు తయారయ్యాయని అన్నారు. ఇలా పేదలను దోచేస్తూ మద్యం తాగమని ప్రోత్సహిస్తున్న  కేసీఆర్‌ సర్కార్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో చెన్నమనేని వికాస్‌ దంపుతలు బిజెపిలో చేరిన సందర్భంగా జరిగిన కార్యాక్రమంలో ఆయన మాట్లాడుతూ..గ్యాస్‌ ధర తగ్గింపుపై బీఆర్‌ఎస్‌ నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు. మిగతా రాష్టాల్రతో పోల్చితే తెలంగాణలో మాత్రమే అత్యధిక పెట్రోల్‌ ధర ఉంది. బెల్టు షాపులు ఏర్పాటు చేసి కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోంది. ఒక చేతిలో ఆసరా పెన్షన్‌.. మరొక చేతిలో బీరు సీసాలు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పన్ను తగ్గించకపోవటం వల్లనే పెట్రోల్‌ ధర మండిపోతోంది. ప్రధాని పిలుపుతో తెలంగాణ మినహా.. అన్ని ప్రభుత్వాలు పన్నులు తగ్గించాయి. ఆర్టీసీ చార్జిలు, భూముల రిజిస్టేష్రన్‌ పెంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. బీరు, బ్రాందీ, భూములు అమ్మి కేసీఆర్‌ ఉద్యోగులకు జీతాలిస్తున్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు పరస్పర అవగాహనతో కార్యాలయాలకూ భూములు కేటాయించుకున్నాయి. ఆరు నెలల ముందే మద్యం షాపులకు వేలం వేసిన ఘనత కేసీఆర్‌దేనని మండిపడ్డారు. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.200 తగ్గింపుతో పేదలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం అన్నారు.  కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పరిపాలన ప్రజలు చూశారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. చెన్నమనేని వికాస్‌ దంపతులు బీజేపీలో చేరటం శుభపరిణామం అన్నారు.  రాజకీయాల ద్వారా వికాస్‌ దంపతులు ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నా. మేధావులు సహా.. తెలంగాణలో అన్ని వర్గాల వారు బీజేపీలోకి రానున్నారు. చెన్నమనేని వికాస్‌ చేరికతో వేములవాడ ప్రాంతంలో బీజేపీకి మేలు జరుగుతుంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ డీఎన్‌ఏ ఒక్కటే. ఇద్దరికీ ఎంఐఎం మధ్యవర్తిగా వ్యవహరిస్తోందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఎంపీ బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.  గ్యాస్‌ సిలిండర్‌ ధర రెండు వందలు తగ్గించి మోదీ విపక్షాల నోరు మూపించారన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తోన్న డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ దీప దంపతులు బీజేపీలో చేరటం శుభ పరిణామమని అన్నారు. చెన్నమమేని కుటుంబం బీజేపీ కోసం పనిచేసిన కుటుంబమని చెప్పుకొచ్చారు. చెన్నమనేని రాకతో సిరిసిల్ల జిల్లాల్లో రెండు సీట్లను బీజేపీ గెలవబోతోందన్నారు. కిషన్‌ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో రామరాజ్యం రావటం ఖాయమని అన్నారు. ఖమ్మంలో అమిత్‌ షా సభ విజయవంతంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లో వణుకు మొదలైందని బండి సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. కాగా.. డాక్టర్‌ చెన్నమనేని వికాస్‌ రావు, దీప తదితరులు కాషాయ కండువా కప్పుకున్నారు. తెలంగాణ బీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి వారిని బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.