సీబీఐకి హాథ్రస్‌ కేసు

– సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ఆదేశం
లక్నో,అక్టోబరు 3(జనంసాక్షి): హత్రాస్‌ జిల్లాలో దారుణహత్యకు గురైన 19 ఏండ్ల బాలిక మృతిపై సీబీఐ విచారణకు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆదేశించారు. అంతకుముందు బాలికను హత్య చేసిన సంఘటనలో నిర్లక్ష్యంగా దర్యాప్తు చేసినందుకు ఎస్పీ హత్రాస్‌ విక్రాంత్‌ వీర్‌, సీఐ రామ్‌ షాబాద్‌ సహా ఐదుగురు పోలీసులను సస్పెండ్‌ చేశారు. బాలిక హత్యోదంతంపై దర్యాప్తు జరిపేందుకు ఉన్నతాధికారులతో కూడిన స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ బృందాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది.ఇలాఉండగా, కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ, ప్రియాంక వాద్రా, మరో ముగ్గురు పార్టీ నాయకుల ప్రతినిధి బృందం బాధిత దళిత బాలిక కుటుంబాన్ని ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లోని బూల్‌గారి గ్రామంలోని వారి ఇంట్లో కలిసింది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వారికి హావిూ ఇచ్చారు. బాధిత  బాలిక కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని రాహుల్‌, ప్రియాంక్‌ చెప్పారు. హత్రాస్‌లోని కొన్ని ప్రాంతాల్లో సీఆర్‌పీసీ సెక్షన్‌ 144 ను అమలు చేసిన నేపథ్యంలో.. గ్రామం, పరిసరాల్లో భారీ పోలీసుల మోహరింపుల మధ్య వీరి పర్యటన కొనసాగింది. ఉత్తరప్రదేశ్‌ ¬ంశాఖ కార్యదర్శి అవనిష్‌ అవస్థీ, డీజీపీ హెచ్‌సి అవస్థీ కూడా బాధితుడి కుటుంబాన్ని నిన్న కలుసుకున్నారు. ఈ విషయాన్ని పరిశీలిస్తున్న సిట్‌ ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హావిూ ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ యూపీ సిఎం యోగి ఆదిత్యనాథ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్‌ చేస్తున్నాయి. హత్రాస్‌ ఘటనపై ఢిల్లీతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి. ఈ సంఘటనలో లైంగికదాడి జరగలేదని యూపీ పోలీసులు పోస్ట్‌ మార్టం, ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఫలితాలను ఉదహరిస్తున్నారు.
హత్రాస్‌ సంఘటనపై స్పందించిన ఉత్తరప్రదేశ్‌ మంత్రి ఎస్‌కే ఖన్నా శనివారం మాట్లాడుతూ.. ”పోస్టుమార్టం, ఫోరెన్సిక్‌, వైద్య నివేదికల ఆధారంగా లైంగికదాడి జరిగినట్లు నిర్ధారించబడలేదు. ఇప్పటికీ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ఐదుగురు అధికారులపై చర్యలు తీసుకున్నది. సిట్‌ నివేదిక దాఖలు చేసిన వెంటనే ఆదర్శవంతమైన దర్యాప్తు అనుసరిస్తుంది” అని చెప్పారు.
సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు
హత్రాస్‌ ఘటనను సుప్రీం కోర్టు పర్యవేక్షించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. హత్రాస్‌లో జరిగినట్లుగా బాధితురాలి కుటుంబ సభ్యులు బాధపడకుండా చూసుకోవడానికి మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్‌ సుష్మా మౌర్య తన పిటిషన్‌లో విజ్ఞప్తిచేశారు.