సుప్రీంకు కేజ్రీవాల్‌

` మనీలాండరింగ్‌ కేసులో విడుదల చేయాలని పటిషన్‌
దిల్లీ(జనంసాక్షి): దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని సోమవారం అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు.ఎక్సైజ్‌ కేసులో సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్‌పై జూన్‌లో దిల్లీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకంగా ఉందని పిటిషన్‌లో వెల్లడిరచారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని కేజ్రీవాల్‌ తరపు న్యాయవాది సుప్రీంను కోరగా తమకు మెయిల్‌ అభ్యర్థన పంపాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌ తెలిపారు.మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. ఎన్నికల అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. కాగా ఈడీ అరెస్టు కేసులో సుప్రీం సీఎంకు జులై 12న మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. అయితే ఇదే కేసులో సీబీఐ ఆయనను అరెస్టు చేయడంతో ప్రస్తుతం జైల్లోనే కొనసాగుతున్నారు.ఇదే కేసులో మొదట అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోదియాకు ఆగస్టు 9న సుప్రీం బెయిల్‌ మంజూరు చేసింది. కాగా రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌కు ఆరు నెలల కస్టడీ తర్వాత ఏప్రిల్‌లో అత్యున్నత న్యాయస్థానం బెయిల్‌ ఇచ్చింది.