స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని కమిషనర్ కు వినతి

రంగారెడ్డి/ ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 22 ( జనంసాక్షి ): ఆదిభట్ల మున్సిపాలిటీలో ఎస్సీ స్మశాన వాటికకు రూ. 20 లక్షలు మంజూరు చేయాలని శనివారం కమిషనర్ అమరెందర్ రెడ్డికి ఆ మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ మర్రి నిరంజన్ రెడ్డి వినతి అందజేశారు. నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిభట్లలోని రెవెన్యూ సర్వేనెంబర్ 656లో గల భూమిని ప్రభుత్వ అవసరాల నిమిత్తమై 158 ఎకరాల భూమిని ఆదిభట్ల  రైతుల నుండి తీసుకున్నారని గతంలో గ్రామ అవసరాలైన  స్మశాన వాటిక నిమిత్తమై నాలుగు ఎకరాల భూమిని కేటాయించారని అన్నారు.  ఆ నాలుగు ఎకరాల భూమిని  గ్రామ ప్రజలు సమాధులు, దహనాలకు వినియోగిస్తున్నారని ఆ భూమిలో ఎలాంటి సౌకర్యాలు లేవన్నారు.  దహన వాటికలు,  స్నానాల గదులు, చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికిగాను పురపాలక సంఘం నిధుల నుండి సుమారు రూ. 20 లక్షలు మంజూరు చేయాలని వినతిలో పేర్కొన్నారు. కార్యక్రమంలో పల్లె సాయిబాబా గౌడ్, వెంకటయ్య, గజ్జల నర్సింహ, పల్స యాదయ్య, పల్లె రవీందర్ గౌడ్, దుబ్బాకుల జంగయ్య గౌడ్, గుడి దేవుని మల్లిబాబు గౌడ్ ఇతరులు పాల్గొన్నారు.