స్వామి అగ్నివేష్పై మరోసారి దాడి
– కేసు నమోదు.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
న్యూఢిల్లీ, ఆగస్టు17(జనం సాక్షి ) : ఢిల్లీలో సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్పై మరోసారి దాడి జరిగింది. బీజేపీకి చెందిన పలువురు కార్యకర్తలు అగ్నివేష్పై దాడికి దిగి గాయపర్చారు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీలో చోటు చేసుకుంది. మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్తుండగా.. అగ్నివేష్పై దాడికి పాల్పడ్డారు. స్వామి అగ్నివేష్పై దాడి జరగడం నెల వ్యవధిలో ఇది రెండోసారి. జార్ఖండ్లో కొద్ది రోజుల క్రితం బీజేపీ కార్యకర్తలు స్వామి అగ్నివేష్పై దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ కార్యాలయం వద్ద అగ్నివేష్పై దాడి జరిగిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. వాజపేయికి నివాళులర్పించేందుకు బీజేపీ కార్యాలయం వద్దకు నడుచుకుంటూ వెళ్తున్నాను. కొంతమంది వ్యక్తులు వచ్చి తనపై దాడి చేశారు. దారుణంగా కొట్టారు. అసభ్యకరంగా దూషిస్తూ.. తన తలపాగాను లాగారని అగ్నివేష్ పేర్కొన్నారు. అగ్నివేష్ దేశద్రోహి, దేశద్రోహి అంటూ తనను చితకబాదినట్లు అగ్నివేష్ వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.