హుస్నాబాద్‌లో ప్రవీణ్‌ రెడ్డి నామినేషన్‌ తిరస్కరణ

ఖానాపూర్‌లో రేఖానాయక్‌ నామినేషన్‌లో తప్పులు

సిద్దిపేట,నవంబర్‌20(జ‌నంసాక్షి): నామినేశన్ల పరిశీలనలో హుస్నాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి అలగిరెడ్డి ప్రవీణ్‌ రెడ్డి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. ఎన్నికల అఫిడవిట్‌తో పాటు బీఫామ్‌ సమర్పించనందుకు రిటర్నింగ్‌ అధికారి ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. సోమవారంతో నామినేషన్ల పక్రియ పూర్తవడంతో… అధికారులు ఇప్పుడు నామినేషన్లను పరిశీలిస్తున్నారు. సరైన సమాచారం లేని నామినేషన్లను తిరస్కరిస్తున్నారు. కాగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు ఈనెల 22 వరకు ఉంది. ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా సిపిఐ నేత చాడ వెంకట్‌ రెడ్డి నామినేషన్‌ వేశారు. అయితే ప్రవీణ్‌ రెడ్డి రెబల్‌గా నామినేశన్‌ వేశారు. దీంతో అతని నామినేషన్‌ తిరస్కరణకు గురయ్యింది. ఇకపోతే నిర్మల్‌ జిల్లా

ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి రేఖానాయక్‌ నామినేషన్‌లో తప్పులు ఉన్నట్లు రిటర్నింగ్‌ అధికారులు కనుగొన్నారు. ఆమె వేసిన మూడూ సెట్లలోనూ ఓ కాలమ్‌ను ఖాళీగా ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. ఆ పత్రాలను కలెక్టర్‌ నిర్ణయం కోసం రిటర్నింగ్‌ అధికారులు పంపారు. అయితే రేఖానాయక్‌ నామినేషన్‌ను తిరస్కరించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.