హైకోర్టును ఆశ్రయించిన వేదాంత
చెన్నై,జూన్20(జనం సాక్షి ): వివాదాస్పద కాపర్ ఫ్యాక్టరీ ‘స్టెరిలైట్’ యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ బుధవారం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. ఫ్యాక్టరీని నిర్వహించేందుకు అవసరమైన కనీస సిబ్బందితో పాటు తగినంత విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమైన ప్లాంటులో సల్ఫ్యూరిక్ యాసిడ్ లీకేజీని సరిదిద్దగల అధికారిక సిబ్బందితో పాటు కనీస విద్యుత్ సౌకర్యం కల్పించాలని అభ్యర్థించింది. కాగా తూత్తుకూడిలో ప్రజాభద్రతకు ఆటంకం వాటిల్లకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్టు తూత్తుకూడి కలెక్టర్ సందీప్ నండూరి పేర్కొన్నారు. విష కాలుష్యాలను వెదజల్లుతున్న స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేయాలంటూ గత నెలలో స్థానికులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులు జరపడంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా గాయపడ్డారు.